Rahul Armur Sabha : తెలంగాణలో మూడవ రోజు కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర జరుగుతోంది. మంథని, జగిత్యాల మీదుగా ఆర్మూర్ కు చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడ నిర్వహించిన జనసభలో మాట్లాడుతూ.. పసుపు రైతులకు మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చారు. బీజేపీ పెద్దలు, ప్రధాన మంత్రితో సహా పసుపు రైతులకు ఐదేళ్ల క్రితం వాగ్ధానాలు చేసి ఆ హామీలను నెరవేర్చలేదని రాహుల్ గుర్తు చేశారు. పసుపు రైతులకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు మద్దతు ధర ఇస్తామని, అలాగే.. వరి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర ఇస్తామన్నారు.
చత్తీస్ గఢ్ లో వరిధాన్యానికి క్వింటాల్ కు రూ.2500 ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, దేశంలో ఈ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ వరి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. అలాగే.. రైతులందరికీ రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం, ప్రతి ఎకరాకు రూ.15000, రైతు కూలీలకు రూ.12000 ఖాతాల్లో వేస్తామని తెలిపారు. అలాగే పసుపు రైతులకు క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ ఇస్తామని తెలిపారు. అన్ని వ్యవసాయ పంటలకు మద్దతు ధరపై రూ.500 బోనస్ గా ఇస్తామని మరోసారి రాహుల్ వెల్లడించారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుంటే.. కేంద్రంలో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని రాహుల్ ధ్వజమెత్తారు. తనపై 24 కేసులు పెట్టి, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దుచేశారన్నారు. తనను ఇంటి నుంచి గెంటివేశారని.. అయినా తనకు బాధగా లేదని రాహుల్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఇంటి నుంచి పొమ్మన్నా.. ఈ దేశమే తనకు ఇల్లన్నారు. తెలంగాణ ప్రజలంతా తన కుటుంబసభ్యులేనన్నారు.