Pravallika Case Update : రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రవళిక సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గ్రూప్స్ పరీక్షలు వాయిదాతోనే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ప్రవళిక మరణానికి గ్రూప్స్ పరీక్షల వాయిదా కారణం కాదంటూ కేసును పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకు ఆధారాలుగా ఆమె తల్లి, సోదరుడితోనే వీడియోలు రికార్డ్ చేయించి విడుదల చేసింది. ప్రవళిక కుటుంబాన్ని నేరుగా ప్రగతిభవన్కు పిలిపించుకుని .. ఆమె ఆత్మహత్య గురించి ఎక్కడా మాట్లాడొద్దని చెప్పడంతో కేసు మరో మలుపుతిరిగింది.
గ్రూప్స్ పరీక్షలు వాయిదాలతో మనస్థాపం చెందిన యువతి ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని.. విద్యార్థులు ఆందోళన, విపక్షాల నిరసనలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన రాత్రి వరకు కూడా కుటుంబ సభ్యులు..పరీక్షల వాయిదాతోనే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. అయితే ఆ తర్వాతి పరిణామాలతో ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమవ్యవహారం కారణమని చెప్పుకొస్తుంది కుటుంబం. ఈ విషయం తెలుసుకున్న రాహుల్.. తన పర్యటనలో భాగంగా ప్రవళిక కుటుంబాన్ని కలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రగతి భవన్ అలర్ట్ అయ్యింది. ప్రవళిక ఇంటికి రాహుల్ వెళ్తే.. ప్రభుత్వ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందని భావించి రాత్రికి రాత్రి అధికారులను, పోలీసులను పరుగులు పెట్టించారు. రాత్రికి రాత్రి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ప్రవళిక పేరెంట్స్ను పిలిపించుకుని జాబ్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు.. ఉదయాన్నే వారిని హైదరాబాద్లోని ప్రగతి భవన్కు తరలించారు. మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. పరీక్షల వాయిదా కారణం కాదని.. ప్రేమవ్యవహారమని.. ప్రవళిక ఆత్మహత్యకు శివరామ్ అనే వ్యక్తి కారణమని..అతన్ని శిక్షించాలని కొత్త పదం అందుకున్నారు.
ప్రవళిక కుటుంబం మాట మార్చడంతో.. ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ నెల 13న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్ చిక్కడపల్లిలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణం ఆమె ప్రియుడు శివరాం వల్లేనని వెల్లడించారు పోలీసులు. శివరాంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. పరారీలో ఉన్న శివరాంను.. పూణెలో అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. పూణె నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు ప్రచారం సాగినా.. శివరాం అరెస్ట్ను మాత్రం పోలీసులు ధృవీకరించలేదు. శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు.. కోర్టులో ప్రవేశపెడుతున్నారు.. కస్టడీ రిమాండ్ కోరే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారని.. శివరాంను ప్రశ్నిస్తే.. మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని వార్తలు వినిపించాయి. కానీ ఓ సారి శివరాం అరెస్ట్ అయ్యారని.. మరోసారి శివరాం ఇంకా పరారీలోనే ఉన్నాడని చెబుతుండటంతో.. కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది.
ఇదిలా కొనసాగుతుండగా ఈ కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. పోలీసుల నుంచి తమకు ప్రాణహాని ఉందని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు శివరాం కుటుంబ సభ్యులు. శివరాం అచూకీ చెప్పాలని.. పోలీసులు తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. తమను, తమ బంధువులను పోలీస్ స్టేషన్కు పిలిపించి.. శివరాం ఆచూకీ తెలుపకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు చెప్పారు. ఒకవేళ శివరాం ఆచూకీ తెలిస్తే పోలీసులకు తప్పనిసరిగా తెలియజేస్తామన్నా.. పోలీసులు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తూ చంపేస్తామంటున్నారని తెలిపారు.