Srisailam: తెలుగునేలపై ఉన్న మహామహిమాన్విత శైవ క్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠంగానూ విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు భ్రమరాంబా మల్లికార్జునుల దర్శనం తర్వాత తప్పక శిఖర దర్శనం చేసుకుంటారు.
వందల ఏళ్ల నాడు శ్రీశైలానికి ఏ రహదారీ లేదు. భక్తులు అటు కర్ణాటక నుంచి, ఇటు త్రిపురాంతం నుంచి తోచిన బాటను పట్టుకుని క్రూరమృగాలు సంచరించే నల్లమల అడవిలో బృందాలుగా స్వామి దర్శనానికి వెళ్లేవారు.
ఒక్కోసారి మార్గ మధ్యంలో భారీ వర్షం వంటి అవాంతరాలు ఎదురైనప్పుడు గుడి వరకు వెళ్లలేకపోయినా.. దూరంగా కనిపించే శ్రీశైల శిఖరాన్ని దూరం నుంచే దర్శించుకుని.. వెనుదిరిగే వారు.
కొండవీటి రెడ్డి రాజైన ప్రోలయ వేమారెడ్డి శ్రీశైలానికి తన హయాంలో దారిని ఏర్పాటు చేయించాక.. శ్రీశైలానికి భక్తుల రాక పెరిగింది. అయితే.. ఆ తర్వాత ఆలయానికి 8 కి.మీ దూరంలోని శిఖరేశ్వరం అనే కొండపై ఉన్న నందికొమ్ముల మధ్య నుంచి ఆలయ శిఖరాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది.
శ్రీశైలంలో శిఖరదర్శనం చేసుకున్న వారికి ఇక.. పునర్జన్మ లేదని ప్రతీతి. ఇక్కడ శిఖరేశ్వరం వద్ద చిన్న నంది విగ్రహం అటూ ఇటూ తిరిగేలా ఉంటుంది. భక్తలు ఈ నందీశ్వరునిపై నువ్వులు వేసి ఈశ్వరుని స్మరించి దానిని స్వామి ప్రధానాలయ శిఖరం వైపు తిప్పి నంది కొమ్ముల నుంచి స్వామి ఆలయ శిఖర దర్శనం చేస్తారు.