Palani: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న ఈ దివ్య క్షేత్రాలలో పళని అత్యంత విశిష్టమైనది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు చిన్నకొండపై కుడిచేతిలో దండంతో, కౌపీన ధారియై చిరునవ్వుతో నిలబడి దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించగా.. తర్వాతి కాలంలో పాండ్యరాజులు అభివృద్ధి చేశారు.
విఘ్నాధిపతిగా శివపార్వతులు మూడు లోకాలు ముందుగా ఎవరు తిరిగి వస్తే.. వారికే విఘ్నాధిపతి అనే పదివిని ఇస్తామని పార్వతీ పరమేశ్వరులు గణపతి, సుబ్రహ్మణ్యడికి చెప్పగా.. గణపతి స్థూలకాయంచేత అక్కడే ఉన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి.. ఆ పందెంలో నెగ్గుతాడు. అయితే.. పందెంలో ఓడిన కారణంగా సుబ్రహ్మణ్యుడు చిన్నబుచ్చుకుని.. ఈ కొండపై అలిగి కూర్చుంటాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు.. సకల జ్ఞానఫలం(తమిళంలో పళం), నీవు (తమిళంలో నీ) అని బుజ్జగించారనీ, నాటి నుంచి స్వామి ఇక్కడ కొలువైనాడని చెబుతారు.
ఇక్కడి గర్భాలయంలోని స్వామివారి విగ్రహం నవ పాషాణములతో తయారుచేశారు. ఇలాంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. క్రీ.పూ. 550-300 కాలానికి చెందిన భోగర్ అనే సిద్ధవైద్యుడు వేలాది అరుదైన మూలికలను, 9 విషపూరిత లోహాలను కలిపి ఈ విగ్రహాన్ని తయారుచేశారని చెబుతారు.
పళని సమీపంలోని వైగావూర్లో జన్మించిన ఈ సిద్ధవైద్యుడు రూపొందించిన ఔషధగుణాలు కలిగిన స్వామివారి నవపాషాణ మూర్తిని అభిషేకించిన పాలూ పంచామృతాలు ఔషధంలా పనిచేస్తాయట.
ఈ విగ్రహానికి చెమటలు పట్టటం మరో విశేషం. రాత్రివేళ స్వామివారికి పూసిన చందనం తెల్లవారుజామున గుడి తెరిచే సమయానికి కరిగిపోతుంది. చందనంతో కలిసి ఈ విగ్రహం నుంచి కారే ఆకుపచ్చ రంగు నీటి చుక్కలను పట్టేందుకు రోజూ ఆలయం మూసే వేళ ఒక గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీనతీర్థం అంటారు. ఈ తీర్థం సేవిస్తే.. ఎలాంటి రోగమైనా తగ్గుతుందని విశ్వాసం.
గతంలో రోగాల బారిన పడిన భక్తులకు స్వామివారి ఊరువు (తొడ) వెనక రాసిన విభూతిని ప్రసాదంగా ఇచ్చేవారట. దీంతో వారి రోగాలు నయమయ్యేవని ప్రతీతి. అయితే.. దీనివల్ల విగ్రహం స్వామి వారి తొడ భాగం అరిగి పోవడంతో ఈ పద్ధతిని ఆపేశారు.
తిరుపతి అనగానే లడ్డూ ప్రసాదం గుర్తొచ్చినట్లుగా.. పళని అనగానే భక్తులకు పంచామృత ప్రసాదం గుర్తొస్తుంది. నెలల పాటు నిల్వ ఉండే ఈ ప్రసాదాన్ని పళని దగ్గరి విరుప్పాచ్చి అనే గ్రామంలోపండే.. వేలెడంత సైజు అరటిపండ్లు, కంజీయం ప్రాంతంలో పండే చెరకుతో చేసిన ముడి పంచదార, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, యాలకులు, నెయ్యి కలిపి తయారుచేస్తారు.
పళని లో కొండ పైకి ఎక్కడానికి మెట్ల మార్గంతో బాటు రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. ‘నన్ను చేరుకోవాలంటే అన్నింటినీ వదిలేయి’ అనే సందేశానికి గుర్తుగానే స్వామి ఇక్కడ కేవలం కౌపీనం(గోచీ)తో కనబడతారని ప్రతీతి.