Harishrao Counter : ఎంపీ రఘరామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు చేసి రెండేళ్లు దాటినా ఎందుకు పెండింగ్ లో ఉందని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతల సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. అసలే ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చండూరు బహిరంగ సభలో కేంద్రంపై కేసీఆర్ చేసిన విమర్శలను బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బలంగా తిప్పికొట్టారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ నేతల విమర్శలపై మంత్రి హరీష్ రావు ఘాటు స్పందించారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ సభతో బీజేపీ నాయకులకు కంటిమీద కునుకులేకుండా పోయిందన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నకిలీ మాటలు మాట్లాడుతూ వెకిలి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్లు మాట్లాడే మాటలు గల్లీ నేతలు కూడా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ 8 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో మునుగోడు వస్తే చూపిస్తామని హరీశ్ రావు సవాల్ చేశారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్ల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. ఢిల్లీలోనో, గల్లీలోనో మాట్లాడటం కాదని.. ప్రజల వద్దకే వెళ్లి అడగాలని బీజేపీ నేతలకు సూచించారు. కిషన్రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని.. రూ.100కోట్ల ఆశ చూపినా తమ ఎమ్మెల్యేలు వాటిని గడ్డి పోచలా చూశారన్నారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకున్నారని కిషన్రెడ్డి చేసిన విమర్శలపై హరీశ్ మండిపడ్డారు. రాజ్యాంగంలో విలీనానికి ఓ ప్రక్రియ ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. తమ పార్టీలో విలీనమైతే తప్పుగా ఎలా చూపిస్తారని నిలదీశారు. గుజరాత్లో 8 మంది, సిక్కింలో 13 మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ఎన్నో ప్రభుత్వాలను కూలగొట్టి దొడ్డిదారిన గద్దెనెక్కారని మండిపడ్డారు.