Revanth Reddy : తెలంగాణ ప్రజల 60 తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సోనియా గాంధీ తీర్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో కేసీఆర్ ప్రజలను వంచించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్షలు నిర్వహించకపోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మించడం వల్లే ఈ ప్రాంతంలో పంటలు పండుతున్నాయని అయితే ఆ పంటలను ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కొనడంలేదని విమర్శించారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందన్న కేటీఆర్ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సూటిగా సమాధానం ఇచ్చారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్, శ్రీరామ్ సాగర్, ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే చేపట్టారని వివరించారు. హైదారాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలను రేవంత్ వివరించారు. అవుట్ రింగ్ రోడ్, ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు, హైటెక్ సిటీ, మెట్రో రైలును తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.
తెలంగాణను సోనియా ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఎలా ఉండేదో వివరిస్తూ.. రేవంత్ రెడ్డి ఘాటుగా సెటైర్లు వేశారు. నాంపల్లి దర్గా దగ్గరో, బిర్లా మందిర్ మెట్ల దగ్గరో కల్వకుంట్ల కుటుంబం భిక్షమొత్తుకుని బతికేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బాగుపడిందని కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ కుటుంబానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ,హైదరాబాద్ చుట్టూ 10 వేల భూములు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ అని రేవంత్ అన్నారు. దేశాన్ని సమైక్యం ఉంచేందుకు ప్రయత్నించిన గొప్పనాయకురాలు ఇందిరా గాంధీ అని వివరించారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన నేత రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది ఆయనేనని తెలిపారు. రాజీవ్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు దేశంలో ఐటీ రంగం ప్రగతి పథంలో ఉందన్నారు. పీవీ నరసింహరావును ప్రధానిగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ ఎవరంటూ కేటీఆర్ ప్రశ్నించడంపై రేవంత్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబ నుంచి వచ్చిన నేత రాహుల్ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో ఢీకొట్టుతున్న నాయకుడన్నారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తీసుకోలేదన్నారు. లోక్ సభ సభ్యత్వం రద్దు చేసి ఇంటిని లాక్కున్నా రాహుల్ పోరాడుతున్నారని వివరించారు.
నేడు గాంధీ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదని రేవంత్ వివరించారు. నెహ్రూ వేల కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి ఇచ్చారని తెలిపారు. 60 ఏళ్ల దేశాన్ని కాంగ్రెస్ పాలిస్తే గాంధీ కుటుంబానికి ఇల్లు లేదని..కానీ తెలంగాణను 10 ఏళ్లు పాలిస్తే కేటీఆర్ కు వెయ్యి ఎకరాల ఫాంహౌస్ వచ్చిందని ఆరోపించారు. తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం రాహుల్ గాంధీ ఎడమకాలి గోటికి కూడా సరిపోదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను సభ వేదికపై రేవంత్ రెడ్డి వివరించారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావును 40 వేల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు..