Maharastra Crime : ప్రతి మనిషి ఓర్పు, సహనాలకు ఒక లిమిట్ ఉంటుంది. ఆడపిల్లలైతే సహనంగా ఉండాలి.. మగాళ్లకు కోపం ఎక్కువగా ఉంటుందనడంలో అర్థం లేదు. భరిస్తున్నారని అంతకు అంతా బాధపడితే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఆ ఇల్లాలు అలా చేయడం తప్పే అయినా.. బహుశా ఆమెకు ఇంతకుమించి మరో దారి కనిపించి ఉండదేమో.
అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా శంకర్ కుంభరే, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న కొడుకు రోషన్.. సంఘమిత్ర అనే యువతిని ప్రేమించి ఆమెనే పెళ్లాడాడు. 5 నెలల క్రితం సంఘమిత్ర తండ్రి వ్యక్తిగత కారణాల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సంఘమిత్రను ఓదార్చాల్సిన భర్త సహా.. అత్తింటి వాళ్లంతా వేధించడం మొదలు పెట్టారు.
వారి వేధింపులతో.. క్రూరంగా మారిన ఆమె వాళ్లందరినీ అంతమొందించాలనుకుంది. కానీ.. ఎలా చేయాలో పాలుపోలేదు. ఇంతలోగా ఆమెకు రోసా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె ద్వారా తెలంగాణ నుంచి విషం కొనుగోలు చేసి.. దానిని నీటిలో కలిపి అత్తింట్లో వాళ్లందరికీ ఇచ్చింది. ఆ నీరు తాగిన శంకర్, విజయ సెప్టెంబర్ 20న అనారోగ్యానికి గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 26న శంకర్, 27న విజయ మరణించారు. శంకర్ కుమార్తెలు కోమల్, ఆనంద, కుమారుడు రోషన్ ఆరోగ్యాలు సైతం విషమించాయి.
అక్టోబర్ 8న కోమల్, 14న ఆనంద, 15న రోషన్ మరణించారు. తల్లిదండ్రులను చూసేందుకు ఢిల్లీనుంచి వచ్చి పెద్దకొడుకు సాగర్ తో పాటు అతని కారు డ్రైవర్, శంకర్ ను చూసేందుకు వచ్చిన బంధువు సైతం అనారోగ్యానికి గురయ్యారు. ఆ నోటా.. ఈ నోటా ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియగా.. పోలీసులకు చేరింది. వరుస మరణాలపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. 4 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగు చూసింది. అత్తింటి వేధింపులు భరించలేక రోసాతో కలిసి సంఘమిత్రే పథకం ప్రకారం వాళ్లందరినీ చంపేసింది.