Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత ద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును..వర్చువల్గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ను నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని జడ్జి సూచించారు. వాటిని పరిశీలన చేసి… అవసరమైన ఆదేశాలు ఇస్తామని జడ్జ్ అన్నారు.చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. మీ ఆరోగ్యం ఎలా ఉందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తనకు ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. జైలులో మెడికల్ టీమ్ ఉందా.. రెగ్యులర్గా చెక్ చేస్తున్నారా అని అడగ్గా… చెకప్ చేస్తున్నారంటూ బాబు సమాధానం చెప్పారు. ఆయా రిపోర్టులు మీకు అందుతున్నాయా అని న్యాయమూర్తి అడగ్గా.. అందుతున్నట్లు టీడీపీ అధినేత చెప్పారు. ఆయన ఆరోగ్యం, భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ న్యాయమూర్తి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన మెడికల్ రిపోర్టులను అందివ్వాలని ఆదేశించారు.వాదనలు పూర్తి అయ్యాక… స్కిల్ కేసు పెండింగ్లో ఉందని.. అందుకే రిమాండ్ పొడిగిస్తున్నామని న్యాయమూర్తి చెబుతూ…. నవంబర్ 1 వరకూ రిమాండ్ పొడిగించారు.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ వెకేషన్ బెంచ్కు బదిలీ అయ్యింది. చంద్రబాబు తరఫు లాయర్ల అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. దీంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై దసరా సెలవుల్లోనే హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.
చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై తాజా పరిస్థితి తెలుసుకునేందుకు మధ్యాహ్నం వరకు సమయం ఇవ్వాలని హైకోర్టును ఏఏజీ కోరారు. మధ్యాహ్నం మరోసారి వాదనలు విన్న హైకోర్టు.. విచారణను వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన ఐఏ పిటిషన్పైనా విచారణను వెకేషన్ బెంచ్ చేపడుతుందని న్యాయమూర్తి తెలిపారు. వెంటనే చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను వెకేషన్ బెంచ్కు ఇవ్వాలని రాజమండ్రి జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది.