CBI : తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రీ. జీవో నెంబర్ 51తో జాతీయ దర్యాప్తు సంస్థకు చెక్ పెట్టాలనే ప్రయత్నం. అయితే, అదంతా విఫల ప్రయత్నమే అంటున్నారు. ఆ జీవోకు అంత సీన్ లేదని.. సీబీఐని అడ్డుకోవడం అంత ఈజీగా జరిగే పని కాదని చెబుతున్నారు. మరి, ఇంత చిన్న లాజిక్ సర్కారుకు తెలీదనుకోవాలా? తెలిసే జీవో 51 తీసుకురావడం వెనుక వ్యూహం ఉందా? ఎప్పుడో ఆగస్టు 30నే ఇచ్చామంటూ.. ఇప్పుడు ఆ విషయం బయటపెట్టడంలో ఆంతర్యం ఏంటి?
ప్రభుత్వ జీవోలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో ఉంచాలని ఉన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా పాత తేదీతో కొత్తగా జీవో 51 జారీ చేశారనే విమర్శ ఉంది. ఒకవేళ మూడు నెలల క్రితమే ఆ జీవో ఇచ్చి ఉన్నా.. కావాలనే ఇప్పుడు బయటపెట్టారని అంటున్నారు. కవిత టార్గెట్ గా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు కొనసాగుతోందనే భయంతోనే ముందుజాగ్రత్తగా ఈ జీవో ఇచ్చారా? అనే అనుమానమూ లేకపోలేదు. అయితే, తెలంగాణలో జనరల్ కన్సెంట్ రద్దు చేసినంత మాత్రాన.. సీబీఐ రాకుండా అడ్డుకోలేరని అంటున్నారు.
లిక్కర్ కేసులో సీబీఐ ఇప్పటికే తెలంగాణలో విస్తృత సోదాలు చేసింది. కీలక సమాచారం రాబట్టింది. బోయినపల్లి అభిషేక్ ను అరెస్ట్ చేసింది. ఇదంతా ఇటీవలే జరిగింది. మరి ఇంతా జరుగుతుంటే.. గతంలోనే జీవో 51 ఇచ్చి ఉంటే.. ఆ విషయం ఎందుకు బయటపెట్టలేదని.. సీబీఐని ఎందుకు అడ్డుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు చిక్కుముడి.. కవిత మెడకు చిక్కుకునే ప్రమాదం ఉందనే హడావుడిగా పాత తేదీతో కొత్తగా జీవో 51 ఇచ్చి ఉంటారని అంటున్నాయి ప్రతిపక్షాలు. త్వరలోనే కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై ఈడీ, సీబీఐ దాడులు తప్పవంటూ బీజేపీ పదే పదే హెచ్చరిస్తుండటం.. ఇదే సమయంలో జీవో 51 రావడం.. అన్నిటికీ ఒకదానితో ఒకటి లింకు ఉందనే అనుమానం.
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1946 సెక్షన్ ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, మేఘాలయ, రాజస్థాన్, చత్తీస్గఢ్తోసహా తొమ్మిది రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతి నిరాకరించాయి. కేంద్రం విచారణ సంస్థల పేరుతో రాజకీయ వేధింపులకు దిగుతోందనే ఆరోపణలతో కొన్ని రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. కేసీఆర్ సర్కార్ సైతం ఆ జాబితాలో చేరింది. అయితే, జీవో 51తో సీబీఐని అడ్డుకోలేరని అంటున్నారు. కోర్టులు ఆదేశిస్తే ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఏదైనా కేసును విచారణ చేయాల్సి ఉంటే, స్థానిక ప్రభుత్వాలు అనుమతించపోతే సీబీఐ న్యాయస్థానం ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకాశం ఉండదు. గతంలోనే పలు కేసుల్లో అలానే జరిగింది.
రాజకీయ పరమైన కేసుల విచారణకు కోర్టుకు వెళ్లి పలుమార్లు ఆయా జీవోలను కొట్టి వేయించింది సీబీఐ. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ , హిమాచల్ ప్రదేశ్ తో వీరభద్రసింగ్, జార్ఖండ్ లో మధుకోడాలు గతంలో ఇలాంటి జీవోలనే ఇవ్వగా.. వాటిని కోర్టు కొట్టి వేసి సీబీఐకు రూట్ క్లియర్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. జనరల్ కన్సెంట్ రద్దు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద మాత్రమే సీబీఐ డైరెక్ట్ గా దాడులు చేయకుండా అడ్డుకోగలదు. అంతేగానీ, కోర్టు పర్మిషన్ ఉంటే.. కవితనే కాదు కేసీఆర్ పైగా కేసులు పెట్టి దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉంటుందంటూ విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. జీవో 51 లాంటి పస లేని జీవోలతో.. కేసీఆర్ అండ్ కో తప్పించుకోలేరని సవాల్ చేస్తున్నాయి.