Revanth Reddy : తెలంగాణలో రెండవరోజు కాంగ్రెస్ విజయభేరి యాత్ర కొనసాగుతోంది. బుధవారం ములుగు రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. రామానుజపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. గురువారం ఉదయం భూపాలపల్లిలోని జెన్ కో అతిథిగృహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీలో రాహుల్ గాంధీ, రాష్ట్ర నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, మధుయాష్కీలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అనంతరం రేవంత్ రెడ్డి భూపాలపల్లి సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..ఒకే అధికారిని సీఎండీగా ఇంతకాలం ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగరేణి గనుల బిల్లుకు పార్లమెంట్ లో బీఆర్ఎస్ మద్దతు తెలుపలేదా ? అని సూటిగా అడిగా. సింగరేణి సంస్థ లాభాల్లో ఉండాలంటే మంచి యాజమాన్యం ఉండాలన్నారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. సింగరేణి కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.
గండ్ర సత్యనారాయణ ఎన్నిసార్లు ఓడిపోయినా మీతోనే ఉన్నారని, ఈసారి గండ్రను గెలిపించాలని సింగరేణి కార్మికులను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములని, సింగరేణి కార్మికుల త్యాగాలను కేసీఆర్ మరచిపోయారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సింగరేణిలో మళ్లీ ఎన్నికలు జరగాలంటే.. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు.