తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉండే గర్భాలయాన్నే ఆనంద నిలయం అంటారు. ఆ ఆలయం గోపురానికి వాయువ్య మూలన ‘విమాన వేంకటేశ్వరుడు’ (Tirumala Vimana Venkateswara Swami) పేరుతో ఒక చిన్న వేంకటేశ్వరస్వామి మూర్తి దర్శనమిస్తుంది.
నిజానికి ఆలయం నిర్మించినప్పుడు ఆ విమాన వేంకటేశ్వరుడి విగ్రహం అక్కడ లేదు. తర్వాతి కాలంలో అది అక్కడికి చేరింది. దీని వెనక ఒక కథ ఉంది.
విజయనగర పాలకులు.. తమ పాలనా కాలంలో స్వామికి అనేక బంగారు ఆభరణాలను అందజేశారు. అయితే.. స్వామికి తామిచ్చిన నగలను తొమ్మిది మంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న సంగతి నాటి పాలకుడైన సాళువ నరసింహరాయల దృష్టికొచ్చింది.
కోపం పట్టలేని రాజు.. ఆ వైష్ణవ అర్చకులను ఆలయ ప్రాంగణంలోనే కత్తితో నరికి పారేశాడు. ఈ ఘోరం విన్న విజయనగర రాజుల రాజగురువు వ్యాసరాయల వారు.. 12 ఏళ్లపాటు పాపపరిహార కృతువులను నిర్వహించారు.
ఈ 12 ఏళ్లూ.. స్వామివారి మూలమూర్తిని భక్తులు దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆలయంపైన మూలమూర్తిని పోలిన విమాన వేంకటేశ్వరుడిని ప్రతిష్టించారని కథనం. అయితే.. దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు.
అయితే.. వైఖానస అర్చకుడిని బాధ్యత నుంచి తొలగించటం, అతని కుమారుడు వయసులో చిన్నవాడు కావటంతో.. మధ్వ సంప్రదాయానికి చెందని వ్యాసరాయల వారే పన్నెండేళ్ళ పాటు తిరుమల ఆలయ ప్రధానార్చకునిగా బాధ్యత నెరవేర్చాడనీ, ఆయనే ఈ విమాన వేంకటేశ్వరుని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారని, విమాన గోపురం మీద ఉన్న వేంకటేశ్వరుడు కనుకే ఆయనకు ఆ పేరు వచ్చిందనే మరో కథనమూ ఉంది.
ఏదేమైనా.. ఆ తర్వాతి రోజుల నుంచి భక్తులు మూలమూర్తి దర్శనం కాగానే బయటికి వచ్చి విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది.
ఆనంద నిలయంలోని శ్రీనివాసుడు.. మనోభీష్టాలను నేరవేర్చే దైవం కాగా.. విమాన వేంకటేశ్వరుడు మోక్షాన్నిస్తాడు. గర్భాలయం నుంచి బయటికొచ్చిన భక్తులు కోరినంత సేపు ఇక్కడ నిలబడి స్వామిని ప్రార్థించుకోవచ్చు.
తిరుమలలో ఏకమూర్తి ఆరాధన విధానం ఉండడంతో శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు నివేదించిన ప్రసాదాన్నే తిరిగి విమాన వేంకటేశ్వరునికీ నివేదిస్తూంటారు.
1982లో మహాసంప్రోక్షణ సమయంలో గర్భాలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరుడు స్పష్టంగా కనిపించేలా ఆ విగ్రహం మీద వెండి మకరతోరణాన్ని పెట్టించి, స్వామిని గుర్తుపట్టేలా ఒక బాణం గుర్తును ఏర్పాటుచేశారు.