Marsquake: భూమిలాగానే అంగారకుడూ కంపించాడు. అదీ అతి తీవ్రంగా!ఆరుగంటల పాటు ఆ కంపనం కొనసాగిందంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నాసా ఇన్సైట్ లాండర్ నిరుడు మే 4న దానిని నమోదు చేసింది. ఆ మార్స్క్వేక్ తీవ్రత 4.7గా శాస్త్రవేత్తలు లెక్కించారు. ఎస్1222ఏగా పిలుస్తున్న ఆ కంపనం 6 గంటల పాటు కుజగ్రహాన్ని కుదిపేసింది. తొలిసారిగా ఇంత తీవ్రస్థాయిలో మార్స్క్వేక్ నమోదు కావడం శాస్త్రవేత్తలను విస్మయపరుస్తోంది. 4.7 తీవ్రత అంటే మన భూమిపై పెద్దగా లెక్కలోకి తీసుకోం. కానీ ఇతర గ్రహాలపై దానిని బలమైన కంపనంగానే భావించాలి.
తీవ్ర కంపనాలు కలిగించే ప్లేట్ టెక్టానిక్ వంటి భూశాస్త్ర ప్రక్రియ ఏదీ మార్స్కు లేదని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు విశ్వసిస్తూ వచ్చారు. భారీ ఉల్కలు ఢీకొట్టడంతో ఆ కంపనాలు వచ్చి ఉండొచ్చని కూడా భావించారు. ఉల్క అంత వేగంగా వచ్చి ఢీకొనే పక్షంలో భారీ గొయ్యి లేదా బిలం ఏర్పడి ఉండాలి. 144.8 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర అంగాకర గ్రహం మొత్తాన్ని జల్లెడ పట్టినా.. అలాంటి ఆనవాళ్లు ఏవీ శాస్త్రవేత్తలకు కనిపించలేదు. టెక్టానిక్ యాక్టివిటీ కారణంగానే కంపించి ఉండొచ్చని ఇప్పుడు నిర్థారణకు వచ్చారు.
అంగారకుడి ఉపరితలం దిగువన ఫాల్ట్స్ వల్ల మార్స్క్వేక్ లు సంభవిస్తున్నాయనే అంశం ఇప్పుడు కీలకంగా మారిందని ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్లానెటరీ సైంటిస్ట్ బెంజమన్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు. అంగారకుడిపై కంపనాలకు సంబంధించిన శబ్దాలు తొలిసారిగా 2019లో రికార్డయ్యాయి.ఇన్సైట్ లాండర్ ఆ కంపన ధ్వనులను గుర్తించింది.
అందులో అమర్చిన సెస్మిక్ ఎక్స్పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్(ఎస్ఈఐఎస్) పరికరం కంపనాలను రికార్డు చేసింది. భారీ కంపనాలకు కారణం ఉల్కలే అన్న వాదన తాజాగా వీగిపోవడటంతో.. మార్టియన్ సెస్మిక్ యాక్టివిటీని అర్థం చేసుకునే దిశగా అడుగు వేశామని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఇంపీరియల్ కాలేజి లండన్ ప్లానెటరీ సైంటిస్ట్ చారలాంబస్ పేర్కొన్నారు.
అంగారకుడిపై 4.7 తీవ్రతతో నమోదైన మార్స్క్వేక్పై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధన చేశారు. అరుణ గ్రహం దక్షిణార్థ గోళంలో అల్-ఖహిరా వాలీస్ రీజియన్ మధ్యభాగంలో ఈ కంపనం చోటు చేసుకుంది. ఉపరితలం నుంచి పదుల కిలోమీటర్ల దిగువన కంపన కేంద్రం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
భూమి క్రస్ట్(వెలుపలి భాగం)ను తీసుకుంటే.. ప్లేట్లుగా ఏర్పడి, నిత్యం కదలికలకు లోనవుతూ ఉంటాయి. ఫలితంగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
అందుకు భిన్నంగా మార్టియన్ క్రస్ట్ మాత్రం సింగిల్ ప్లేట్గా ఏర్పడింది. మరి ఈ కంపనాలకు కారణమేమిటి? అందుకు కారణం..మార్స్పై ఫాల్ట్స్ ఇంకా క్రియాశీలంగా ఉండటమేనని ఫెర్నాండో వివరించారు. అంగాకర గ్రహం నెమ్మదిగా కుంచించుకుపోతోందని, చల్లబడుతోందని వివరించారు. ఈ ఫాల్ట్స్ వల్లే అంగారకుడు కంపిస్తున్నాడని చెప్పారు.
అరుణగ్రహం లోపలి వైపు నుంచి వెలువడుతున్న టెక్టానిక్ ఫోర్స్ కారణంగా మార్స్క్వేక్స్ సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. నాలుగేళ్ల పాటు పనిచేసిన నాసా ఇన్సైట్ లాండర్ 2022లో సేవలకు స్వస్తి చెప్పింది. అందులో అమర్చిన సెస్మోమీటర్ పరికరం మొత్తంమీద 1319 మార్స్క్వేక్లను రికార్డు చేసింది. నిరుటి మార్స్క్వేకే వాటిలో అతి పెద్దది.