Telangana Jobs : నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం అరిగోసపడాల్సి వస్తోంది. రాష్ట్రం ఏర్పడితే కొలువులకు కొదవుండదని నమ్మి..ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రంలో.. తొమ్మిదేళ్లు గడిచినా కొలువులు వచ్చుడేమో కానీ.. ఉద్యోగాల కోసం ఎదురు చూసి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చూస్తున్నారు. పరీక్షలు రద్దు, వాయిదాలతో ప్రభుత్వ నోటిఫికేషన్లపై నమ్మకం కోల్పోయి ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు తిరిగి గ్రామాలకు వెళ్లి కూలిపనులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇటీవల గ్రూప్-1 రద్దు, గ్రూప్-2 వాయిదాతో మనస్థాపం చెంది యువతి ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చూశాం. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. విద్యార్థులు ఆందోళన, విపక్షాల నిరసనలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. అనంతరం నెలకొన్న పరిణామాలు ప్రవళిక ఆత్మహత్య ఘటనకు పరీక్షల విషయం కాదని..మరో విషయంతో ఆమె ఆత్మహత్యకు చేసుకున్నట్లు ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు కూడా చెప్పుకొచ్చారు. ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన రాత్రి వరకు కూడా కుటుంబ సభ్యులు.. పరీక్షలు వాయిదాతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని చెప్పుకొచ్చారు. కానీ ఉదయానికి మాటమార్చి తమ కూతురు ఆత్మహత్యకు కారణం పరీక్షల వాయిదా కాదని..ప్రేమవ్యవహారమని చెప్పడం మొదలు పెట్టారు.
ఈ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్.. ప్రవళిక మృతిని కూడా రాజకీయం చేశారని మండిపడ్డారు. ప్రవళిక కుటుంబ సభ్యులు తన వద్దకు వచ్చి.. న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. అమ్మాయిని వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతామన్నారు కేటీఆర్.
ప్రవళిక కుటుంబ సభ్యులను ప్రగతి భవన్ కు పిలుపించుకుని వారితో మాట్లాడి.. ధైర్యం చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రవళిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని.. నిందితుడిని పట్టుకుని చట్టపరంగా శిక్షపడేలా చూస్తామన్నారు. ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ను కలిసిన కుటుంబ సభ్యులు.. కేసు పురోగతిపై డీజీపీతో మాట్లాడారని, నిందితుడికి శిక్షపడేలా చూస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రవళిక సోదరుడు ప్రణయ్ తెలిపాడు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు నిందితుడని చెబుతున్న శివరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలొస్తున్నా..ఈ విషయంలో మాత్రం పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శివరాం ప్రస్తుతం ఎక్కడున్నాడనేది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో శివరాం పట్టుబడ్డాని వార్తలు వినిపిస్తున్నా.. ఒక వేళ పోలీసుల అదుపులో ఉంటే ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలాకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ TSPSCని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. TSPSCని అవసరమైతే ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ చేపడుతామని వెల్లడించారు. రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని.. ఇప్పటికే 1.3 లక్షల ఉద్యోగాలిచ్చామని..మిగితావి భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి మిగతా ఉద్యోగాలనూ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.