Balineni SrinivasReddy : ఏపీ మాజీ మంత్రి బాలినేనికి భారీ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన అపాయింట్మెంట్ ను సీఎం జగన్ రద్దు చేశారు. ధనుంజయరెడ్డిని కలవాలని సీఎం ఆదేశాలు పంపారు. సీఎం తన అపాయింట్మెంట్ ను రద్దు చేయడంతో బాలినేనికి ఊహించని షాక్ తగిలినట్టైంది. కొంతకాలంగా బాలినేని తీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. బాలినేని సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని.. దీంతో పార్టీకి డ్యామేజ్ జరుగుతోందన్న అభిప్రాయంలో సీఎం జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో బాలినేనికి టికెట్ కూడా దక్కకపోవచ్చని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఒంగోలు పోలీసుల తీరుపై బాలినేని సీరియస్ అయ్యారు. ఫేక్ డాక్యుమెంట్స్ స్కామ్ కేసులో పోలీసుల వ్యవహారశైలిని తప్పు పడుతూ.. తన గన్మెన్లను వెనక్కి పంపించారు. వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు డీజీపీకి బాలినేని లేఖ రాశారు. కేసులో అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపిస్తున్నారు. కాగా.. నకిలీ స్టాంపుల కేసులో పోలీసులు రెండు దఫాలుగా ఏడుగురిని అరెస్ట్ చేశారు.