Pravalika Case Update : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక ఆత్మహత్య ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపింది. కేసీఆర్ సర్కార్పై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే,.. పోలీసుల దర్యాప్తులో ప్రియుడు శివరామ్ మోసం కారణంగానే ప్రవళిక సూసైడ్ చేసుకున్నట్టు తేలడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక శివరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోపక్క ఈ కేసులో ఆందోళనలు చేసిన పలువురు నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయ రెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భాను ప్రకాష్, సనత్ నగర్ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కోట నీలిమ సహా మొత్తం 14 మందిపై సెక్షన్ 143, 148, 341, 332, 149 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. కాగా అటు ప్రవళిక కుటుంబసభ్యుల వాంగ్మూలం తీసుకున్న అనంతరం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన నిందితుడు శివరాం రాథోడ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
ప్రవళిక కేసు వెనుక రాజకీయ నాటకమేదో జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ వ్యవహారం పెద్దదవుతుందన్న కారణంతోనే శివరామ్ పేరుతో బీఆర్ఎస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.