BJP-Janasena Alliance : తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం పొలిటికల్ హీట్ను పెంచుతోంది.బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కమలనాథులు చర్చలు జరిపారు. అయితే.. సేనాని 30 సీట్లు డిమాండ్ చేయడంతో ఈ పొత్తు వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ ఎన్నికల కదనరంగంలో కమలం పార్టీ గాజు గ్లాసుతో కలిసి వెళ్లాలని ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్రావు పవన్తో చర్చలు జరిపారు. ఈ భేటీ హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పొత్తుపై తీవ్రంగా చర్చించారు. ఈ భేటీలో పవన్ తమ పార్టీ నాయకులు అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలతో పంచుకున్నారు. బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించారు. గతంలో తెలంగాణ బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సీట్ల పంపకాల్లో ఏవైనా తేడాలు వస్తే తమ పార్టీ క్యాడర్ నిరుత్సాహానికి గురవుతుందని స్పష్టం చేశారు.
అంతకుముందు తెలంగాణ జససేన శ్రేణులతో సమావేశమైన పవన్ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయడంపై చర్చించారు. ఈసారి కూడా ఎలక్షన్స్కు దూరంగా ఉంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని నేతలు ఆయనతో చెప్పినట్లు సమాచారం. నేతల అభిప్రాయాలు విన్న ఆయన.. వారి అభిప్రాయానికి విలువ ఇస్తానని… 2-3 రోజుల్లో పార్టీ తగిన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.