India Vs Pakistan: పాక్ నటి బోల్డ్ ఆఫర్..ఇండియా చేతిలో పాక్ ఓటమి పాలైంది. సాక్షాత్తూ కెప్టెన్ బాబర్ ఆజామ్ వెళ్లి కొహ్లీని అడిగి జెర్సీ తీసుకున్నాడు. ఒక సహృద్భావ వాతావరణంలో అంతా ముగిసిందని ప్రపంచ క్రీడాలోకం అంతా అనుకుంది. హమ్మయ్యా ఏ గొడవా లేకుండా సద్దుమణిగిందిరా బాబూ అనుకున్నారు. కానీ పాకిస్తాన్ నటి ఇచ్చిన ఓ స్వీట్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ముఖ్యంగా పాకిస్తాన్ లో చాలామంది ఇండియా చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రకరకాలుగా వారి అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో సెహార్ షిన్వారి అనే పాకిస్తానీ నటి పది అడుగులు ముందుకేసింది. ఇండియాను ఓడిస్తే బంగ్లాదేశ్ క్రికెటర్లకు బోల్డ్ ఆఫర్ ఇచ్చింది. నేను బంగ్లాదేశ్ టీమ్ లో ఆ రోజు ఎవరు బాగా ఆడి, ఇండియా ఓటమికి కారణం అవుతారో, వారితో డేటింగ్ కి వస్తా… అంటూ చకచకా టైప్ చేసి పారేసింది.
ప్రపంచకప్ లో భాగంగా పుణె వేదికగా ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో ఇండియా దుమ్ము రేపుతోంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్లు ఇండియా ఓడిపోవాలని కోరుకుంటున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్ లాంటి పసికూన చేతిలో ఓడిపోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే అటు ఆఫ్గాన్ చేతిలో ఇంగ్లాండ్, ఇటు నెదర్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయాయి. అందువల్ల ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పి…పాకిస్తాన్ నటి సెహర్ షిన్వార్ బోల్డ్ ఆఫర్ ఇచ్చేసింది.
అయితే అమ్మడి స్టేట్మెంట్లు షరా మామూలే..వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. ఇది ఆమెకు కొత్త కాదని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఆసియా కప్ లో కూడా ఇండియా చేతిలో పాక్ ఓడిపోయింది. అప్పుడు కూడా సెహర్ షిన్వార్ ఏం చెప్పిందంటే పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మీద కేసు పెడతానని ట్వీట్ చేసింది. వీటన్నింటినీ నెటిజన్లు గుర్తు చేస్తూ …ముందు మీ బాబర్ మీద కేసు పెట్టమ్మా…తర్వాత డేటింగ్ కి వెళుదువుగానీ అని సెటైర్లు విసురుతున్నారు. ఇంతకుముందు ఓసారి ట్విటర్ నే వదిలేసి వెళ్లావు గుర్తు లేదా? అని ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాని ఓడించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లాంటి పెద్ద జట్లను ఓడించింది. పనిలో పనిగా ఆఫ్గానిస్తాన్ ని మట్టి కరిపించింది. అయితే బంగ్లాదేశ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగే రెండు సంచలనాల నేపథ్యంలో రేపు ఇండియా కూడా జాగ్రత్తగానే ఆడుతుందని క్రీడా పండితులు చెబుతున్నారు.