Priyanka Gandhi : ములుగు నియోజకవర్గంలో రామానుజపురం బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సూపర్ స్పీచ్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, కేసీఆర్ తొమ్మిన్నర ఏళ్ల పాలనపై సుధీర్ఘంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది యువకులు అమరులైన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుందని అందరూ కలలు కన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పాలనతో తమ బతుకులు మారతాయని రైతులు, కార్మికులు , యువత భావించారన్నారు. కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.
సామాజిక న్యాయ జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ రోడ్ మ్యాప్ తయారు చేసిందని ప్రియాంక వెల్లడించారు. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి చూపించామన్నారు. ఇప్పుడు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని.. అందుకే ఆరు గ్యారంటీలతో సంక్షేమ పథకాలు ప్రకటించామన్నారు.
బీఆర్ఎస్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేసిందని ప్రియాంక మండిపడ్డారు. తెలంగాణలో 40 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లేవని తెలిపారు. యూనివర్శిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. యువత ఆత్మహత్యలకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
గల్ఫ్ వెళ్లే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని ప్రియాంక గాంధీ ప్రకటించారు. అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ఎస్సీ , ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షలు ఆర్థికసాయం అందిస్తామన్నారు.
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రియాంక ఆరోపించారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా , వైన్ మాఫియా, మైన్ మాఫీయాలు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పోడు భూముల పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. భూదాన్ భూమలు కూడా అమ్మేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మిలాఖత్ అయిపోయాయని ప్రియాంక విమర్శించారు.