Gautam Adani: ఫైనాన్షియల్ టైమ్స్ కథనం! పదేళ్ల కాలంలోనే అదానీ ఆర్థిక సామ్రాజ్యం ఎదిగిన తీరును కళ్లకు కట్టాయి. అదానీ కంపెనీల ప్రతి అడుగు వెనుకా అక్రమాలు, అవినీతి ఉన్న విషయాన్ని బట్టబయలు చేశాయి. అదానీ కంపెనీల బొగ్గు దిగుమతుల బాగోతాన్ని బ్రిటన్కు చెందిన ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ఆధారాలు సహా బయటపెట్టింది.
ఆ కథనం ప్రకారం చూస్తే.. అదానీ బొగ్గు దిగుమతుల వెనుక భారీ అవినీతే చోటుచేసుకుంది. ఆ దిగుమతుల విలువ రెట్టింపైన తీరు వెనుక గుట్టును ఆ పత్రిక రట్టు చేసింది. దేశంలో బొగ్గును అత్యధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటున్న ఏకైక పెంపెనీ అదానీ కోల్. అలా వచ్చిన విదేశీ బొగ్గును అత్యధిక ధరలకు విక్రయించడంతో వినియోగదారులు, వివిధ కంపెనీలకు విద్యుత్తు కొనుగోలు తలకు మించిన భారమైంది.
అదానీని ‘మోడీస్ రాక్ ఫెల్లర్’గా ఫైనాన్షియల్ టైమ్స్ అభివర్ణించింది. స్వల్ప సమయంలో శరవేగంగా ఎదిగిన తీరునూ వివరించింది. కేవలం పదేళ్లలో దేశంలోనే అతి భారీ ప్రైవేట్ థర్మల్ పవర్ కంపెనీ అధిపతి కాగలిగారని, అతి పెద్ద పోర్ట్ ఆపరేటర్గా ఎదగగలిగారని ఆ పత్రిక వివరించింది. ఇంతకీ బొగ్గు దిగుమతుల్లో అదానీ గ్రూప్ చేసిన విన్యాసం ఏమిటి?
2019-21 మధ్య ఇండొనేషియా నుంచి అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులకు సంబంధించి 30 షిప్మెంట్ల వివరాలను ఫైనాన్షియల్ టైమ్స్ పరిశీలించింది. 30 దఫాలుగా 3.1 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి జరిగింది. అయితే ఇండొనేషియాలో ఎగుమతి చేసిన బొగ్గు విలువకు, దిగుమతుల సమయంలో ఇండియాలో చూపిన ధరకు భారీ వ్యత్యాసం కనిపించింది. ఈ 30 షిప్మెంట్ల ద్వారానే అదానీ గ్రూప్రూ.600 కోట్లకు పైగా లాభం ఆర్జించింది.
ఎగుమతి రికార్డుల ప్రకారం చూస్తే బొగ్గు ధర 1.9 మిలియన్ డాలర్లు. దీనికి షిప్పింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ కలిపి 42,000 డాలర్లు అదనం. ఈ మొత్తాన్ని మించి దిగుమతి ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. గుజరాత్లోని అదానీ సొంత పోర్టు ముంద్రాలో ఆ బొగ్గు దిగుమతి జరిగింది. ఆ రికార్డుల ప్రకారం బొగ్గు విలువను 4.3 మిలియన్ డాలర్లుగా చూపారు.
అంటే ఓవర్ ఇన్ వాయిసింగ్ ద్వారా 53 శాతానికి మించి మార్జిన్ను సొంత ఖాతాలో వేసుకున్నారని ఆ పత్రిక వెల్లడించింది. ఈ కారణంగానే అపరిమిత లాభాలు కనిపిస్తున్నాయని వివరించింది. వాస్తవంగా బొగ్గు రంగంలో లాభాల మార్జిన్ అంత పెద్ద మొత్తంలో ఉండదని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.
తైవాన్లోని హీ లింగోస్, దుబాయ్లోని తౌరుస్ కమోడిటీస్ జనరల్ ట్రేడింగ్, సింగపూర్లోని ప్యాన్ ఆసియా ట్రేడ్లింక్ మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా అదానీ గ్రూప్ ప్రధానంగా విదేశాల నుంచి బొగ్గు దిగుమతులు చేసుకుంటోంది. ఇలా గత రెండేళ్ల కాలంలోనే 5 బిలియన్ డాలర్ల విలువైన బొగ్గున దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. దేశీయ మార్కెట్లోని బొగ్గు ధరతో పోలిస్తే.. రెట్టింపునకు పైగా అదానీ కంపెనీలు ధర చూపించాయని ఆ కథనం తెలిపింది.
అదానీ గ్రూప్లో ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్. దానికి వచ్చే ఆదాయంలో అధిక మొత్తం బొగ్గు లావాదేవీల ద్వారానే సమకూరుతోంది. అదానీ కోల్ ట్రేడింగ్ విభాగం పేరు ఇంటిగ్రేటెడ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. దీని లాజిస్టిక్స్, కమోడిటీ ట్రేడింగ్లో 200 మంది నిపుణులు పనిచేస్తుంటారు. వీరంతా నాలుగు అంతర్జాతీయ కార్యాలయాలు, 19 భారతీయ కేంద్రాల్లో ఉంటారు.
వాస్తవానికి ఏడేళ్ల క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ).. బొగ్గు దిగుమతుల్లో జరుగుతున్న అక్రమాలను గుర్తించింది. ఇండొనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటూ దేశంలో కృత్రిమ బొగ్గు కొరతను సృష్టిస్తున్నారని, దీన్ని విదేశాలకు ధనాన్ని తరలించే మార్గంగానూ మార్చుకుంటున్నారని 40 దిగుమతిదారులకు 2016లో డీఆర్ఐ నోటీసులిచ్చింది. ఆ జాబితాలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్ సహా అదానీకి చెందిన కంపెనీలు ఉన్నాయి.
దేశంలో, ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన గౌతం అదానీపై, ఆయన గ్రూప్పై ఆరోపణలకు కొదవేం లేదు. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అక్రమాలను అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రిసెర్చి బహిర్గతపర్చినప్పుడు ఎంత అలజడి రేగిందో తెలిసిందే. అదానీ కోసం ప్రధాని హోదాలో మోదీ చేసిన విదేశీ టూర్లు, అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాలపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో తాజాగా అదానీ గ్రూపు బొగ్గు బాగోతంపై ఫైనాన్షియల్ టైమ్స్ కథనం సంచలనంగా మారింది.