RBI : ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించని కారణంగా ఆ బ్యాంకులకు రూ.16.14 కోట్ల జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్ పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ పై రూ.3.95 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపింది. బ్యాంకుల్లో అనర్హత కలిగిన బ్యాంకులకు రుణాలిచ్చిన విషయాన్ని దాచినందుకు ఆర్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంది.
ఈ మేరకు ఆర్బీఐ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆర్థిక సేవల ఔట్ సోర్సింగ్ లో రిస్క్ మేనేజ్ మెంట్, ప్రవర్తనా నియమావళికి సంబంధించిన సూచనలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ పై పెనాల్టీ విధించినట్లు ఆ ప్రకటనలో వివరించింది. బ్యాంక్ కస్టమర్ సర్వీస్, లోన్, అడ్వాన్స్ ప్రొవిజన్ ల ద్వారా నామినేట్ చేయబడిన రికవరీ ఏజెంట్ లోని లోపాలకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. మార్చి 31, 2022న జరిగిన వార్షిక ఆడిట్ లో సర్వీస్ ప్రొవైడర్ పై సమీక్ష నిర్వహించడంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైనట్లు ఆర్బీఐ గుర్తించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించకుండా ఉదయం 7 గంటల నుందు, సాయంత్రం 7 గంటల తర్వాత కస్టమర్లను సంప్రదించినందుకు కూడా కోటక్ మహీంద్రాకు జరిమానా విధించినట్లు తెలిపింది.