Janasena : తెలంగాణలో ఎన్నికల రణరంగంలో వెనుకబడిన బీజేపీ ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ భేటీ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జనసేనాని వారితో చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో పోటీపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని జనసేన పార్టీ ప్రకటించింది. హైదరాబాద్లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పోటీపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. గతంలో బీజేపీ విజ్ఞప్తి చేయడంతో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు జసనేన దూరంగా ఉంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని పవన్ దృష్టికి తెలంగాణ జనసేన నేతలు తీసుకెళ్లారు.
నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని కోరారు. ఈ విషయంపై జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కల్యాణ్ తో జరిగిన సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ శాఖ ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తాళ్లూరి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు రాజలింగం, ప్రధాన కార్యదర్శి ఎం.దామోదర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నికల బరిలోకి జనసేన దిగుతుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పోటీ చేస్తే హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలతోపాటు తెలంగాణలోని మరికొన్ని సెగ్మెంట్లలో జనసేన కొద్ది ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒకవేళ జనసేన జీహెచ్ ఎంసీ ఎన్నికల మాదిరిగానే పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇస్తుందా? ఈ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఏపీలో జనసేనాని టీడీపీ, బీజేపీ రెండు పార్టీలతో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ కలిసిరాకుంటే టీడీపీతో కలిసి బరిలోకి దిగుతామని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అక్కడ బీజేపీ వైఖరి తేలాల్సిఉంది. మరి తెలంగాణ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.