Congress Bus Yatra : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. తొలుత ములుగుజిల్లా లోని రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయమంతటినీ భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకెళ్లాయి. ములుగు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో హై అలర్ట్ ప్రకటించారు. రామప్పకు వచ్చే ప్రతీ వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బుధవారం 30 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర నిర్వహించనుండగా.. దారిపొడవునా నో ప్లే జోన్ ను డిక్లేర్ చేశారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బైక్ పెట్రోలింగ్ టీమ్, సాయుధ బలగాలు, లోకల్ పోలీస్ టీమ్, సీఆర్పీఎఫ్ బలగాలు, రాహుల్ చుట్టూ ఎస్పీజీ మోహరింపు ఏర్పాటు చేశారు.
కాగా.. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బస్సు యాత్ర జరగనుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ పలువురు కార్మికులు, ఇతర వర్గాలతో సమావేశం కానున్నారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి, పెద్దపల్లి, ఆర్మూల్ లలో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు. మూడు రోజుల పర్యటనతో తొలివిడత యాత్ర ముగియనుండగా.. దసరా తర్వాత హస్తం పార్టీ రెండో విడత యాత్రను ప్రారంభించనుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత మూడో విడత యాత్ర నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బుధవారం రామానుజపురంలో సుమారు 50 వేల మంది మహిళలతో నిర్వహించే సభలో.. రాహుల్ మహిళా డిక్లరేషన్ ను విడుదల చేస్తారు.