Jawaharlal Nehru : ఒక్కోసారి కొన్ని ప్రభుత్వ దరఖాస్తులు పూర్తిచేసేటప్పుడు ‘మరీ ఇన్ని ప్రశ్నలా? బొత్తిగా తలాతోకా లేకుండా ఉన్నాయి? అసలు ఇన్ని వివరాలెందుకు? అసలు ఈ దరఖాస్తులు ఎవరైనా చూస్తారా?’ అని మనం విసుక్కుంటూ ఉంటాం.
జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన విదేశీ మిత్రుడికీ ఇలాగే చిరాకు కలిగింది. ఆ విదేశీ మిత్రుడి పేరు కింగ్ స్లీ మార్టిన్. బ్రిటన్లోని ‘న్యూ స్టేట్స్మన్ అండ్ నేషనల్’ అనే వారపత్రికకు ఆయన ఎడిటర్. తరచూ పర్యాటక శాఖ వారి ఆహ్వానం మేరకు భారత్ వచ్చి ఇక్కడి విశేషాలను తన పత్రికలో కవర్ చేసేవాడు.
అప్పట్లో ‘ఎల్లో ఫీవర్’ అనే ప్రాణాంతక జ్వరం విదేశీయుల నుంచి భారత్లోకి వ్యాపించింది. దీంతో దేశంలోకి వచ్చిన ప్రతి విదేశీయుడూ.. తాను ఒకరోజు క్రితం ఎవరితో ఉన్నాడు? రెండవరోజు, మూడవ రోజు, ఇలా 9 రోజుల వివరాలు వివరాలున్న దరఖాస్తును ఎయిర్ పోర్టులో నింపాల్సి వచ్చేది. విజిటర్ ఏదైనా ‘ఎల్లో ఫీవర్’ ప్రబలిన ప్రాంతం నుంచి వచ్చాడా అని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ దరఖాస్తును తెచ్చింది.
కింగ్ స్లీ.. భారత్ వచ్చినప్పుడల్లా అధికారులిచ్చే ‘ఎల్లో ఫీవర్’ దరఖాస్తులోని ప్రశ్నలకు ఆయనకు చిరాకొచ్చేది. నాలుగైదు సార్లు పోయాక.. ‘నిజంగా అధికారులు ఈ దరఖాస్తులు చూస్తున్నారా?’ అనే అనుమానం వచ్చి, పరీక్షించాలనుకున్నాడు.
పేరున్న ఎడిటర్, దానికి తోడు ప్రధాని నెహ్రూ మిత్రుడు. ఇక.. ఆయనకు భయమేముంది? తనదైన హాస్య ధోరణిలో.. ‘ఒక రోజు క్రితం’ అనే కాలమ్ ఎదురుగా ‘మేరీ’ అనీ, ‘రెండు రోజుల క్రితం’ కాలమ్లో ‘థెరీసా’ ఇలా తొమ్మిది రోజుల్లో 9మంది మహిళల పేర్లు రాసి దరఖాస్తులో రాసి ఇచ్చేసి.. నాలుగైదు రోజులు భారత్లో ఉండి తిరిగి బ్రిటన్ వెళ్లిపోయాడు.
లండన్ వెళ్లాక.. తన పత్రికలో ఈ దరఖాస్తు ముచ్చటను ప్రస్తావిస్తూ ‘చివరికి నేను ఊహించిందే జరిగింది. భారత్లో అధికారులెవరూ దరఖాస్తులు చదవరనే నా అనుమానం ఇప్పుడు నిజమైంది’ అంటూ రాసిన కథనం మరుసటి వారం పత్రికను తిరగేస్తున్న ప్రధాని నెహ్రూ గారి కంట పడింది.
దీంతో.. ఆయన మండిపడుతూ.. విదేశాంగశాఖ జూనియర్ అధికారిని పిలిపించి ఇదేంటని నిలదీశారు. ‘నేను మా పై అధికారులకు ఎప్పటినుంచో ఆ దరఖాస్తులో ‘ఎవరితో’ అనేది తీసేసి ‘ఎక్కడ’ అని పెట్టాలని మొత్తుకుంటున్నా.. ఎవరూ నా మాట ఆలకించలేదు’ అంటూ ఆ జూనియర్ అధికారి అసలు సంగతి బయటపెట్టాడు. దీంతో అదే రోజు ఆ ఎల్లో ఫీవర్ దరఖాస్తులోని ప్రశ్నలు మారిపోయాయి.