Cancer Drug: క్యాన్సర్ ను సమర్థంగా ఢీకొట్టగల కొత్త ఔషధాన్ని ఆవిష్కరించారు పరిశోధకులు. క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా రోగనిరోధకశక్తిని గణనీయంగా పెంచగలదా డ్రగ్. ఆస్టిన్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ పరిశోధకులు దీనిని అభివృద్ధి చేశారు. ఓ సాధారణ డీఎన్ఏ లోపించడమే పలు కేన్సర్ వ్యాధులకు కారణం. కొత్త డ్రగ్ ఆ లోపాన్ని సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
డీఎన్ఏ లోపించిన కారణంగా ఇమ్యూన్ సెల్స్ను నిరోధించేలా ఓ విష మిశ్రమాన్ని క్యాన్సర్ కణాలు విడుదల చేస్తుంటాయి. జంతువులపై డ్రగ్ సమర్థంగా పనిచేయడమే కాకుండా ఇమ్యూనోథెరపీతో సత్ఫలితాలు కూడా కనిపించాయని పరిశోధకులు వెల్లడించారు. మానువులపైనా ట్రయల్స్ విజయవంతం కాగలిగితే క్యాన్సర్ చికిత్సలో ఇదో ముందడుగుగా చెప్పొచ్చు.
పెగ్-ఎంటాప్(PEG-MTAP)గా వ్యవహరిస్తున్న ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ పై పోరాడటంలో రోగనిరోధక కణాల సత్తా గణనీయంగా పెరుగుతుంది. ఎలుకలపై ఈ డ్రగ్ను పరీక్షించి చూడగా.. మెలనోమా, బ్లాడర్ క్యాన్సర్, లుకేమియా, కోలన్ క్యాన్సర్ కణుతుల పెరుగుదల బాగా నెమ్మదించింది. అదే సమయంలో ఇమ్యూనెథోరపీ మరింత ప్రభావవంతమైంది. క్యాన్సర్ బాధితులకు వరం కానున్న ఈ పరిశోధన ఫలితాలు క్యాన్సర్ సెల్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
అన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల్లో 9పీ21 అనే డీఎన్ఏ సాధారణంగా లోపిస్తుంటుంది. మెలనోమా(melanoma), బ్లాడర్ క్యాన్సర్ (bladder cancer), మెజోథీలియోమా(mesothelioma), కొన్ని రకాల బ్రెయిన్ క్యాన్సర్లలో 9పీ21 లోపించడమనేది 25% నుంచి 50% వరకు సంభవిస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో బాధితులకు ఇమ్యూనోథెరపీలతో కూడా ఎలాంటి ఫలితం ఉండదు.
తమను గుర్తించి నాశనం చేయకుండా.. క్యాన్సర్ కణాలు ఇమ్యూన్ వ్యవస్థ కళ్లు గపేస్తాయి. దీంతో ఎంటీఏ అనే టాక్సిక్ కాంపౌండ్ను క్యాన్సర్ సెల్స్ విడుదల చేయగలుగుతాయి. రోగనిరోధక కణాల పనితీరును ఎంటీఏ అడ్డుకుంటుంది. ఈ కారణంగానే ఇమ్యూనోథెరపీలు నిరుపయోగంగా మారతాయి.
రిసెర్చర్లు ఆవిష్కరించిన కొత్త డ్రగ్ ఎంటీఏ స్థాయులను గణనీయంగా తగ్గిస్తుంది. ఒకసారి ఎంటీఏ సాధారణ స్థాయికి చేరగానే.. ఇమ్యూన్ వ్యవస్థ తిరిగి చైతన్యవంతమవుతుంది. ఆపై క్యాన్సర్ కణాలను గుర్తించే లక్షణాన్ని తిరిగి పొందగలుగుతుంది. ఈ డ్రగ్ వల్ల కీలకమైన ఇమ్యూన్ సెల్ అయిన టీ-సెల్స్ ఉనికి మరింత పెరుగుతుంది. ట్యూమర్ సెల్స్ను గుర్తించి నాశనం చేసేవి ఇవే. పెగ్-ఎంటాప్ ఔషధంతో ఇమ్యూనోథెరపీల పనితీరు కూడా పెరుగుతుంది.
ఎంటీఏను విచ్ఛిన్నం చేయగల, మన శరీరం సహజసిద్ధంగా తయారుచేయగలిగిన ఓ ఎంజైమ్ను వినియోగించుకుని ఈ డ్రగ్ పనిచేస్తుంది. ఎంజైమ్ దీర్ఘకాలం మనగలిగేలా మోడిఫైడ్ వెర్షన్ను రిసెర్చర్లు అభివృద్ధి చేశారు. దీంతో క్యాన్సర్ ను డ్రగ్ మరింత సమర్థంగా అడ్డుకోగలదు. పెగ్-ఎంటాప్ డ్రగ్పై పరిశోధకులు మరిన్ని సేఫ్టీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అనంతరం మానవ క్లినికల్ ట్రయల్స్ను ఆరంభిస్తారు. అవి విజయవంతమైతే ఇమ్యూనోథెరపీలతోనే క్యాన్సర్ ను సమర్థంగా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.