BJP Mission 90 : రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలూ ఎన్నికల వార్ కు సిద్ధమవుతున్నాయి. కానీ.. బీజేపీ మాత్రం అటు అభ్యర్థుల జాబితాలోనూ..ఇటు.. మేనిఫెస్టో ప్రకటనలోనూ అన్ని పార్టీల కంటే వెనుకబడింది. మిషన్ 90 అంటూ ముందు నుంచి ప్రణాళికలు వేసుకోవటంతో ముందున్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. అభ్యర్థుల జాబితా ఇవాళా- రేపూ అంటూ దాటేస్తోంది. మొదటి అభ్యర్థుల జాబితా ఆలస్యం కానుంది. వాస్తవానికి కాంగ్రెస్ అనౌన్స్ కంటే ముందే జాబితా ప్రకటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ.. ఆ జాబితా మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రకటించబోయే జాబితాలో తమ పేరు ఉంటుందో లేదో అని ఊపిరి బిగపట్టుకుని ఉన్నారు. కమలం పార్టీ ఫస్ట్ లిస్ట్ మరింత ఆలస్యం కావటంతో ఆశావహుల్లో అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఒకవేళ ఆశించిన టికెట్ రాకపోతే పార్టీని వీడేoదుకు నేతలు పక్క పార్టీలో కర్చీఫ్ వేశారని ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారంలో భాగంగానే జాబితా ఆలస్యం చేస్తున్నారనే తెలుస్తోంది . అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తరువాత ప్రకటిస్తే.. జాబితా విడుదల చేస్తే.. నేతలెవరూ పక్కచూపు చూడరనేది కమల వ్యూహంగా కనిపిస్తోంది.
పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాతే బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశముంది. కమిటీ సమావేశం ఇవాళ లేదా రేపు జరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ భేటీలో అభ్యర్థుల ఎంపికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మీటింగులో తీసుకున్న నిర్ణయం ఆధారంగానే జాబితా వెలువడే అవకాశముంది. ఆశావహులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే.. జాతీయ నాయకత్వం మాత్రం మరింత సస్పెన్స్ లోనే పెడుతూ వస్తుండటంతో ఇప్పుడు అందరి చూపు బీజేపీ లిస్ట్ పైనే ఉంది. మొదటి జాబితాకు సిద్దంగా ఉన్నారా..?లేక.. 119 స్థానాలకు మొత్తం ఒకే సారి అభ్యర్థులను ప్రకటిస్తారా ? అన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ అభ్యర్థుల లిస్టు కూడా వస్తే.. ముక్కోణ పోరులో ఎవరిపై ఎవరు విజయం సాధిస్తారో అంచనాలు వేసేందుకు రాజకీయ పండితులు సిద్ధంగా ఉన్నారు.