Asian Games 2023: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత రక్షణ దళంలో సైనికులకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ భారీ నజరానా ప్రకటించారు. 19వ ఆసియా క్రీడల్లో పాల్గొన్న సాయుధ దళాలకు చెందిన పతకాల విజేతలను ఢిల్లీ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.25 లక్షలు, వెండి పతకం సాధించిన వారికి రూ.15 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు నగదు బహుమతి ప్రకటించారు. అలాగే క్రీడాకారులు, వారి సహాయకులు, రక్షణ సిబ్బంది అధికారులు మొత్తం 76 మందితో కేంద్రమంత్రి ఇంటరాక్ట్ అయ్యారు.
19వ ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్ జౌలో ఇటీవల ఘనంగా ముగిశాయి. ఇందులో భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో 107 పతకాలు సాధించింది.
మొత్తం టీమ్ అందరినీ ఆయన అభినందించారు. క్రీడల్లో ఉత్సాహం చూపించిన ఔత్సాహికులను ప్రోత్సహించిన ఉన్నతాధికారులను అభినందించారు.
పతకాలు సాధించడంతో మన దేశ గౌరవం మరింత పెరిగిందని కొనియాడారు. రక్షణ దళం సాధించిన పతకాలు దేశ యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయని కేంద్రమంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మిల్కా సింగ్ ని గుర్తు చేసుకున్నారు. ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. భారత అథ్లెటిక్స్ కు మార్గదర్శకంగా నిలిచాడని తెలిపారు. ఇది యువతకు స్ఫూర్తినిస్తుందని, మరింత మంది క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయులున్న మన దేశంలో ఎంతోమంది ఉత్సాహవంతమైన యువత ఉందని అన్నారు. వారికి నిజమైన స్ఫూర్తిని నేడు పతకాలు సాధించిన వారు అందించారని అన్నారు.
రక్షణ దళం గురించి మాట్లాడుతూ ఇది యుద్ధభూమి అయినా, ఆటస్థలమైనా సైనికులు ఎంతో క్రమశిక్షణతో పాల్గొంటారని అందుకే మనకు పతకాలు వచ్చాయని నమ్ముతున్నట్టు తెలిపారు. పతకాల సాధనకు కష్టపడిన క్రీడాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.