KCR : ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూకుడు పెంచారు. తనయుడు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. విపక్ష పార్టీలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందని ప్రజలను హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సిరిసిల్లతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 70 ఏళ్లలో ఈ ప్రాంతంలో కనీసం వందసార్లు తిరిగానన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని గతాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అప్పర్ మానేరుతో ఏడాదంతా నీరు అందుబాటులో ఉంటోందని వివరించారు. తాను కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే గెలిపించారని చెప్పుకొచ్చారు, అప్పట్లో ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతో బాధపడ్డానని తెలిపారు. పార్టీ నిధులు, చందాలు సేకరించి చేనేత కార్మికులకు సాయం చేశానన్నారు.
కేటీఆర్ చేనేత శాఖ మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల రూపు రేఖలు మారిపోయాయని తనయుడిని కేసీఆర్ ప్రశంసించారు. షోలాపూర్ మాదిరిగానే సిరిసిల్లను చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పనకోసమే బతుకమ్మ చీరల పథకం అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేశాయన్నారు. ఎవరికైనా నచ్చకపోతే చీరలు తీసుకోవద్దన్నారు. కానీ చీరల పంపిణీని మాత్రం రాజకీయం చేయొద్దని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మంచి విద్యా కేంద్రంగా సిరిసిల్ల అభివృద్ధి చెందుతుందన్నారు.
ధరణి పోర్టల్ ను తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ధరణి రద్దయితే మళ్లీ వీఆర్వోల వ్యవస్థ వస్తుందని తెలిపారు. అప్పుడు అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ రైతులు తిరగాల్సిందేనన్నారు. ధరణి పోర్టల్ ను తొలగించి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధరణి ఉండాలో? వద్దో ? రైతులే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.
రైతు బంధు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని అంటున్నారని.. 3గంటలు కరెంట్ కావాలా? 24 గంటల కరెంటు కావాలా? అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారాయని మంత్రి కేటీఆర్ అన్నారు.