Chandrababu Naidu : చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సీఐడీ తరపున ముకుల్ రోహిత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్ట్, కౌంటర్ అఫిడవిట్ అంతా ఆరోపణలతోనే ఉందని.. 73 సంవత్సరాల వయసున్న చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని హరీష్ సాల్వే తెలిపారు. ఎలాంటి సందర్భంలోనైనా చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని.. వెంటనే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్నారు. మరోవైపు సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్గీ.. అసలు క్వాష్ పిటిసన్ వర్తించదంటూ వాదనలు వినిపించారు.
అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినపుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని, అవినీతి కేసుల విచారణకే ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారని తెలిపారు. వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉంటే.. సెక్షన్ 422 సీఆర్ పీసీ కింద క్వాష్ చేయలేమని, ఆరోపణలు ఉంటే ఛార్జిషీట్లు వేసి విచారణ చేసి శిక్ష వేయొచ్చన్నారు. రోహిత్గీ వాదనలు విన్న జస్టిస్ త్రివేది.. కేవలం ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతామా అని ప్రశ్నించారు. అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించాలని, లేదంటే క్వాష్ చేయాలని ముకుల్ రోహిత్గీ తెలిపారు.
కాగా.. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపించారు. చట్ట సవరణను ముందు నుంచీ వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ప్రస్తావించారు. 2019లో శాంతి కండక్టర్స్ కేసు, 1964లో రతన్ లాల్ కేసులను సాల్వే ప్రస్తావించారు. ఎన్నికల ముందు జరిగే కక్షసాధింపులను నిరోధించేందుకు సెక్షన్ 17ఏ ఉందని, అదే లేకపోతే వేధింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. స్కిల్ స్కామ్ ఎఫ్ఐఆర్ లో మొదట చంద్రబాబు పేరు లేదన్న సాల్వే.. రిమాండ్ సమయంలోనే ఆయన పేరును చేర్చినట్లు ధర్మాసనానికి తెలిపారు. 73 ఏళ్ల వయస్సులో చంద్రబాబు 40 రోజులుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. కోర్టుకు దసరా సెలవులున్న నేపథ్యంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. బెయిల్ పిటిషన్ పై తీర్పును శుక్రవారం(అక్టోబర్ 20) వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపారు.