SAPTAPADI – SEVEN STEPS: హిందూ వివాహ పద్ధతిలో నూతన దంపతులను అగ్నిచుట్టూ ప్రదక్షిణం చేయించే సంప్రదాయమే.. సప్తపది. భార్యాభర్తలు పాలూ నీళ్లలా కలసిపోవాలనీ, ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలని, ఈ క్రమంలో ఒకరి తప్పొప్పులను మరొకరు సరిదిద్దాలనే పరమార్ధాన్ని మన పెద్దలు ఏడు అడుగులు వేయటం ద్వారా సూచించారు.
‘ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’ అంటూ నూతన వధూవరులు తొలి అడుగు వేస్తారు. ‘పరమాత్ముడైన విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక’ అని దీని అర్థం.
రెండవ అడుగు వేస్తూ.. ‘ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’ అంటారు. అనగా.. ‘ మనిద్దరికీ శక్తి లభించేలా చేయుగాక’ అని అర్థం.
‘త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’ అంటూ వేసే మూడవ అడుగుకు ‘వివాహ వ్రతసిద్ధికోసం విష్ణువు అనుగ్రహించుగాక’ అని అర్థం.
నాలుగో అడుగు వేసేటప్పడు ‘చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’ అంటారు. అనగా.. ‘ విష్ణువు మనకు ఆనందమును కల్గించునుగాక’ అని అర్థం.
ఇక.. అయిదో అడుగు వేస్తూ చెప్పే ‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’ అనేమాటకు ‘విష్ణువు మనకు అపారమమైన పశుసంపదను అనుగ్రహించుగాక’ అని అర్థం.
‘షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’ అంటూ వేసే ఆరో అడుగుకు ‘ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక’ అని అర్థం.
చివరి అడుగు వేస్తూ ‘సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’ అంటారు. దీనికి ‘గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక’ అని అర్థం.