Osama al-Mazini: హమాస్పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. సోమవారం ఒక్క రోజే గాజాలోని 200 హమాస్ సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ నాయకుడు, షురా కౌన్సిల్ హెడ్ ఒసామా అల్-మజిని మృతి చెందినట్టు ఐడీఎఫ్, ఇజ్రాయెల్ భద్రతా సంస్థ షిన్బెట్ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
ఐడీఎఫ్ సైనికుడు గిలాడ్ షాలిత్ అప్పగింత సమయంలో జరిగిన సంప్రదింపుల్లో మజిని కీలక పాత్ర పోషించారు. 2006లో హమాస్కు చిక్కిన షాలిత్ 2011 అక్టోబర్ వరకు బందిగా ఉన్నాడు. తమ చెరలో ఉన్న 1027 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెడతామని ఇజ్రాయెల్ హామీ ఇచ్చిన తర్వాతే షాలిత్కు చెర వీడింది. ఈ సందర్భంగా హమాస్ సంప్రదింపులు నెరపడంలో మజిని కీలకంగా వ్యవహరించారు.
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో హమాస్కు చెందిన 200 స్థావరాలు నేలమట్టమయ్యాయి. హమాస్ మిలిటెంట్లు వినియోగించే బ్యాంక్, ఆపరేషనల్ హెడ్క్వార్టర్స్, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు వీటిలో ఉన్నాయి. గాజా సిటీలో నడిబొడ్డున ఉన్న హమాస్ భవనాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ నేవీ కూడా దాడులు చేసింది. ఆయుధాల నిల్వ చేసిన వేర్హౌస్లు ఆ భవనాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.