GPS Jamming : ఇజ్రాయెల్ ఉత్తరాన ఉన్న హైఫా నివాసి ఒకరు మొబైల్ఫోన్లో లొకేషన్ వివరాలు చూసి విస్తుపోయారు. లెబనాన్లో ఉన్నట్టుగా జీపీఎస్ చూపిస్తుండటంతో కాస్త కలవరపడ్డారు. ఆయనే కాదు.. చాలా మంది ఇజ్రాయెలీల మొబైల్ ఫోన్లలో కొన్ని రోజులుగా లొకేషన్ అప్లికేషన్లో అంతరాయాలను చవిచూశారు.
ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) జీపీఎస్ జామింగ్ను మరింత తీవ్రతరం చేయడమే దీనికి కారణం. హమాస్, హిజ్బుల్లా మిలిటెంట్ల డ్రోన్ల దాడులను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్లో నేవిగేషన్ వ్యవస్థతో అవాంతరాలపై ఐడీఎఫ్ స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే శాటిలైట్ నేవిగేషన్ను వ్యవస్థను స్తంభింపచేసినట్టు వెల్లడించింది. సైనిక ఆపరేషన్ల అవసరాల రీత్యా జామింగ్ తప్పని సరైందని వివరించింది. పౌరులకు ఈ అసౌకర్యం తాత్కాలికమేనని తెలిపింది.
జామింగ్ ప్రక్రియ ప్రభావం జీపీఎస్ సర్వీసులు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి.. జీపీఎస్ సిగ్నళ్లు పూర్తిగా స్తంభించిపోతాయి. రెండు.. స్పూఫింగ్. అంటే లొకేషన్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పంపడం. జీపీఎస్ సర్వీసులను మొబైళ్లలో మాత్రమే కాదు.. విమానాలు, నౌకలు, వాహనాల్లోనూ వినియోగిస్తారు. అలాగే క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లకూ జీపీఎస్ అవసరమే.
జీపీఎస్ లొకేషన్ సాయంతోనే శత్రు లక్ష్యాలను అవి ఛేదించగలుగుతాయి. మిలిటెంట్ల నుంచి దాడుల ముప్పును తప్పించుకునేందుకే జీపీఎస్ రిసీవర్లు తాత్కాలికంగా పనిచేయకుండా లేదంటే ఆ రిసీవర్లు తప్పుడు సమాచారం ఇచ్చేలా ఇజ్రాయెల్ చర్యలు తీసుకుంది. అలా తప్పుగా చూపే లొకేషన్లు.. వాస్తవ లొకేషన్కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఉండొచ్చు.
ఇక లెబనాన్ సరిహద్దుల్లో 4 కిలోమీటర్ల పరిధిలో ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. పౌరులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. నిషేధిత ప్రాంతంలో జీపీఎస్ సర్వీసులను నిలిపివేసింది. లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్లోని పట్టణాలను లక్ష్యంగా చేసుకుని పదే పదే దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ సహా పశ్చిమాసియా ప్రాంతంలో జీపీఎస్ సర్వీసుల్లో అంతరాయాలు పదిశాతం కంటే ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది.