Telangana Elections 2023 : అక్షరాల 109 కోట్ల 11 లక్షల 917 రూపాయలు. ఎంటీ ఫిగర్ అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు సీజ్ చేసిన నగదు, బంగారం, లిక్కర్, ఇతరత్రా వాటి విలువ ఇది. ఎన్నికల షెడ్యూల్ వచ్చి వారం రోజులే అయినప్పటికీ రాష్ట్రంలో ఈ రేంజ్లో డబ్బు, నగలు, లిక్కర్ సీజ్ జరగడం.. అందరిని అవాక్కయ్యేలా చేస్తోంది.
ఇప్పటివరకు సరైన పత్రాలు లేని 58 కోట్ల 96 లక్షల 98వేల 917 రూపాయల నగదును పట్టుకున్నారు. అలాగే 6 కోట్ల 64 లక్షల 81 వేల 307 రూపాయల విలువైన లిక్కర్ను సీజ్ చేశారు. ఇక 2 కోట్ల 97 లక్షల61వేల 595 రూపాయల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 33 కోట్ల 62 లక్షల 56వేల విలువచేసే.. మెటల్ ఐటెమ్స్ అంటే బంగారం, వెండి, డైమండ్స్ లాంటి వాటిని పోలీసులు సీజ్ చేశారు. ఇక ఎన్నికలవేళ ఉచితంగా పంచేందుకు సిద్ధంగా ఉన్న ల్యాప్ టాప్, వెహికల్స్, కుక్కర్స్, చీరలు లాంటివి కూడా పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ 6 కోట్ల 89 లక్షల 18వేలు ఉంటుందని తెలిపారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 25 కోట్ల 82 లక్షల 49వేల 191 రూపాయల విలువ గల డబ్బు, నగలు సీజ్ చేశారు. తాజాగా జీనోమ్ వ్యాలీలో నిర్వహించిన తనిఖీల్లో సరైన బిల్లులు చూపని 8 కేజీల బంగారం, 9 కేజీల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 8 కేజీల గోల్డ్, 9 కేజీల సిల్వర్కు పత్రాలు సరైన ఆధారాలను చూపిస్తే.. వాటిని తిరిగి అందజేస్తామని పోలీసులు తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. జిల్లా సరిహద్దులు, రాష్ట్ర బార్డర్లలోనూ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అనుమానం వచ్చిన ప్రతీ వాహనాన్ని చెక్ చేస్తున్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో దొరికిన నగదు, ఆభరణాలు, లిక్కర్ విలువ వందకోట్లను దాటడం అంటే మాములు విషయం కాదు. అయితే అందతా.. పొలిటికల్ పార్టీలు ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకు తీసుకొచ్చిన డబ్బేనా అంటే నో ఆన్సర్. ఎందుకంటే పట్టుబడ్డ నగదులో కచ్చితంగా సామాన్య జనంకు సంబంధించినవి ఉంటాయి. పోలీసులు చెకింగ్స్ చేస్తున్న సమయంలో సరైన పత్రాలు చూపించకపోవడం వల్ల ఆ నగదును అధికారులు సీజ్ చేస్తున్నారు.