Cricket In Olympics : ఇక నుంచి ఒలంపిక్స్ లోకి క్రికెట్,128 ఏళ్ల తర్వాత మెగా పోటీల్లో క్రికెట్.2028 లాస్ ఏంజిల్స్ లో టీ20 మ్యాచెస్ తో షురూ
ఎప్పటి నుంచో క్రీడాభిమానులకు ఒక డౌట్…ఎందుకు ఒలంపిక్స్ లోకి క్రికెట్ ని చేర్చలేదు. ఇది ఊసుపోని ఆటని అపోహ పడ్డారా? లేక రోజంతా సమయాన్ని వృథా చేసే ఆటగా చూస్తున్నారా? టైం వేస్ట్ గేమ్ అనుకున్నారా? లేక కేవలం 10 దేశాలు మాత్రమే ఆడే ఆటగా భావిస్తున్నారా? లేదంటే ఇది ధనవంతుల ఆటగానే పరిగణించారా? ఇంకా చెప్పాలంటే బ్రిటీష్ వాళ్లు కనిపెట్టిన ఈ ఆటకి విధి విధానాలు లేవని అనుకున్నారా? ఎన్నో అపోహలు, ఇంకెన్నో సందేహాలు… ఏమైతేనేం…వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 128 ఏళ్ల తర్వాత క్రికెట్ కి ఒలంపిక్స్ లో చోటు కల్పించారు.
ప్రపంచంలోని ఎన్నో దేశాల అథ్లెటిక్స్ కలిసి ఒలంపిక్స్ లో పాల్గొంటారు. అందులో పతకం గెలిస్తే అది ఆ దేశానికే గర్వకారణంగా భావిస్తారు. అన్నిరకాల ఆటలకు ఒలంపిక్స్ లో చోటు దొరికిందిగానీ క్రికెట్ కి దొరకలేదు. కానీ ఎట్టకేలకు 2028లో లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో టీ 20 క్రికెట్ కి స్థానం కల్పించారు. ఇది నిజంగా క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. 1900 సంవత్సరంలో తొలిసారి క్రికెట్ ని ఒలంపిక్స్ లో భాగం చేశారు గానీ తర్వాత తొలగించారు. మళ్లీ ఇన్నాళ్లకి మోక్షం కలిగింది.
క్రికెట్ తో పాటు మరో నాలుగు క్రీడలకు కూడా చోటు కల్పించారు. అందులో బేస్ బాల్- సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లక్రాస్ (సిక్సస్), స్క్వాష్ లు ఉన్నాయి. క్రికెట్ ను ఒలింపిక్స్ లో భాగం చేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో మాత్రం మినహాయించారు. 2028 లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో మాత్రం క్రికెట్ కనువిందు చేయనుంది. మహిళలు, పురుషుల క్రికెట్ జట్లు టీ 20 ఫార్మాట్ లో పోటీ పడతాయి.