BRS Election Campaign : తెలంగాణ రాష్ట్రం రాకముందు కొత్త జిల్లాలకు వెళ్తే ఏడుపొచ్చేదని, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపించేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన కేసీఆర్.. సోమవారం జనగామ మెడికల్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. తొలుత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వెళ్తే.. ఊరిలో ఒక్క యువకుడు కూడా కనిపించలేదని, యువకులంతా పొట్టచేతబట్టుకుని వలస వెళ్లినట్లు చెప్పారన్నారు. ఇప్పుడు బచ్చన్నపేటలో 365రోజులు మంచినీరు ఉంటుందని, కనీస అవసరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణ వచ్చాక ఎంతో మేథోమదనం చేసి.. రాష్ట్రాన్ని అభివద్ధి చేశామని.. దాని ఫలితమే ఇప్పుడు వేలాది లారీల్లో ధాన్యం తరలి వెళ్తోందని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలనే ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చామని, రైతు వేలిముద్ర లేనిదే.. ఎవ్వరూ వారి భూమి జోలికి వెళ్లలేరని తెలిపారు. అలాంటి ధరణిపోర్టల్ ను తీసి సముద్రంలో వేస్తామని విపక్షాలు అంటున్నాయని, రైతులకు 3 గంటల కరెంట్ చాలని అన్న కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ ధ్వజమెత్తారు. మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ.. రైతు భీమా తరహాలోనే వ్యక్తి చనిపోతే రూ.5 లక్షలు వస్తాయని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. తెల్లరేషన్ కార్డు దారులకు సన్నబియ్యం అందజేస్తామన్నారు.
ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దని, ఓటు మన తలరాతను మారుస్తుందని కేసీఆర్ హితవు పలికారు. మంచి ఏదో, చెడు ఏదో గుర్తించి.. ఆలోచించి ఓటు వేయాలని.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామని కేసీఆర్ తెలిపారు.