BJP Election Campaign : తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందని, ఆయన కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. సోమవారం జమ్మికుంటలో నిర్వహించిన జనగర్జన సభలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను ఈ సందర్భంగా అభినందించారు. ఈటల రాజేందర్ కూడా ప్రసంగించి, తనపై కేసీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రజల గుండెల్లో స్థానం ఉన్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరని అన్నారు.
1984లో బీజేపీ 2 లోక్ సభ స్థానాల్లో గెలిస్తే.. తెలంగాణ బీజేపీ నుంచి జంగారెడ్డి ఎన్నికయ్యారని రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు. 27 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉందని, అభివృద్ధికి గుజరాత్ రోల్ మోడల్ గా నిలిచిందని కొనియాడారు. మరి పదేళ్లుగా కేసీఆర్ సీఎంగా ఉన్న తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధి అంటే తనకు హైదరాబాద్ ఒక్కటే కనిపిస్తోందని, రాష్ట్రంలో ఇంకెక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటున్నారని రాజ్ నాథ్ పేర్కొన్నారు.
కేసీఆర్ తన కుటుంబానికే తొలి ప్రాధాన్యత ఇస్తారని, రాష్ట్రంలో ఆయన పాలనలో ఆ కుటుంబమే బాగుపడిందని రాజ్ నాథ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎలక్షన్ లో స్వయంగా కేసీఆర్ ప్రచారం చేసినా.. విచ్చలవిడిగా ప్రజలకు డబ్బు పంచినా రాజేందర్ ను ఓడించలేకపోయారని ఎద్దేవా చేశారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఏ పథకం కావాలన్నా బీఆర్ ఎస్ లోకి రావాలంటున్నారని వాపోయారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనను కమలాపురం ఓటర్లు 25 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేసుకున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. దాదాపు తాను మంత్రి అయ్యాకే జరిగిందన్నారు. హాస్టళ్లలో ఎన్ని ఇబ్బందులుంటాయో తెలుసు కాబట్టే.. విద్యార్థులకు సన్నబియ్యం ఇచ్చానని, వైద్యశాఖ మంత్రిగా ఉన్నపుడు ఆసుపత్రులలో వసతులను పెంచానని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు హైదరాబాద్ లో సమ్మె చేస్తే.. కేసీఆర్ 1700 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారని విమర్శించారు. 2021లో తనను ఆశీర్వదించినట్లు.. ఈసారి కూడా హుజారాబాద్ ప్రజలు బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఈటల రాజేందర్ కోరారు.