Election Code : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే.. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏ వాహనాన్ని వదలకుండా తనిఖీ చేస్తూ.. రాష్ట్రమంతా అక్రమ నగదు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికలకు ఇంకా 45 రోజులుండగా.. ఎక్కడా అక్రమాలకు తావివ్వకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.. తనిఖీల్లో పట్టుబడిన అక్రమ నగదును, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు.
సోమవారం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా డబ్బు, బంగారం పట్టుబడింది. మియాపూర్ లో నిర్వహించిన వాహన తనిఖీలలో ఒక కారులో భారీగా బంగారం బయటపడింది. అక్రమంగా తరలిస్తోన్న 27.540 గ్రాముల బంగారం, 15.650 కిలోల వెండిని గుర్తించారు. ఈ ఆభరణాలకు సంబంధించిన బిల్లులు చూపించకపోవడంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా.. కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తోన్న రూ.2 కోట్ల 9 లక్షల డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారుతో పాటు ఒక బైక్ ను కూడా సీజ్ చేశారు.