Bombay High Court : ఆడపిల్లలు, మహిళల వస్త్రధారణపై మన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులు ఎప్పుడూ ఏదొక కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలకు కారణం.. వారి వస్త్రధారణే అని చాలా మంది వాదిస్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా.. అన్ని వర్గాలు, కులాలకు చెందిన స్త్రీలపై, ముక్కుపచ్చలారని పిల్లలపై ప్రతిరోజూ దేశం నలుమూలల్లో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో వెలుగులోకి వచ్చేవి కొన్నే. కేసు పెడితే పరువుపోతుందని భావించి చీకట్లోనే తుడిచిపెట్టుకుపోయిన అభాగ్యురాళ్ల జీవితాలెన్నో ఉన్నాయి. ఇదంతా కనీస లోకజ్ఞానం ఉన్నవారందరికీ తెలుసు. అయినా సరే.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు వారి వస్త్రధారణే కారణమని గుడ్డిగా జడ్జ్ చేసేస్తారు.
మహిళలపై జరిగే హింసకు వారి వస్త్రధారణే కారణమని చెప్పేవారి చెంపచెళ్లుమనేలా.. బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఓ కేసులో కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. నాగ్ పూర్ లోని రెండు రిసార్టులపై మే నెలలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు మహిళలు పొట్టి స్కర్ట్ లు వేసుకుని డ్యాన్సులు చేస్తుంటే.. కొందరు మద్యం తాగుతూ ఉన్నారు. ఆ రిసార్టుపై పోలీసులు దాడులు చేసి.. పొట్టిస్కర్టులు వేసుకుని ఉండటాన్ని అశ్లీలతగా పరిగణించి వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసు విచారణ నాగ్ పూర్ బెంచ్ కు వెళ్లగా.. విచారణ చేసిన ధర్మాసనం మహిళలు పొట్టి బట్టలు వేసుకుని, రిసార్టులో డాన్సులు చేయడాన్ని అశ్లీలతగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, పబ్లిక్ ప్లేస్ లలో ఇలాంటివి జరిగితే వాటిని నేరంగా పరిగణించవచ్చు కానీ.. రిసార్టులు, బంకెట్ హాల్స్ వంటి ప్రాంతాల్లో జరిగిన వాటిని నేరంగా తీసుకోలేమని తెలిపింది. రిసార్టులు, బంకెట్ హాల్స్ పబ్లిక్ ప్లేస్ లు కావని, వాటిపై కేసులు ఎలా పెడతారని పోలీసులను ప్రశ్నించింది. అక్కడున్న వారిలో ఎవరూ ఫిర్యాదు చేయకుండా.. ఇలాంటి ఫంక్షన్లపై పోలీసులు కేసులు పెట్టరాదని పేర్కొంటూ.. కేసును కొట్టివేసింది.