Amaravati Assigned Land case : ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్ పై విచారణ జరిగింది. రాజధాని పేరుతో భూముల అవకతవకలకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది.
అసైన్ డ్ భూములకు సంబంధించి చంద్రబాబు, నారాయణలపై 2021లో కేసు నమోదు చేయగా ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం నేటికి తీర్పును రిజర్వ్ చేసింది. అసైన్డ్ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో నారాయణ, చంద్రబాబు పిటిషన్లు వేయగా వాటి పైన విచారించిన హైకోర్టు నేడు తీర్పును వెలువరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. అసైన్డ్ భూముల కేసు వ్యవహారంలో కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకుని విచారించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
సీఐడీ సమర్పించిన కొత్త ఆధారాలను పరిశీలించిన కోర్టు.. కేసు రీ ఓపెన్ కు ఏమైనా అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశించింది. అక్టోబర్ 17న మరిన్ని వీడియో ఆధారాలను అందజేస్తామని సీఐడీ తెలుపగా.. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.