CM Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విశాఖకు షిఫ్ట్ కావడంపై ఇంకా సందిగ్ధం వీడడం లేదు. ఈ నెల 23న ముహూర్తం ఖరారు చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో అధికారుల్లో అయోమయం నెలకొంది. ఈ నెల 19నే సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అటు డిసెంబర్ 30వరకు రాజధాని అమరావతి కేసు ఉన్న నేపథ్యంలో.. అప్పటి వరకు సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదన్న ప్రచారం కూడా ఉంది.
ఇక మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ నెల 23నే సీఎం జగన్ రావాలని లేదు.. రేపే రావచ్చు, నవంబర్ లో రావచ్చు, డిసెంబర్ లో రావచ్చు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యే విషయంపై సందిగ్థత నెలకొంది. చాలావరకూ ఈ దసరాకు సీఎం విశాఖకు షిఫ్ట్ అవ్వడం అసాధ్యమన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విశాఖలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వివిధ శాఖల ఆఫీస్ లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.