Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ ఎన్నికల సమరశంఖారావం పూరించింది . పార్టీ అభ్యర్థుల్లో 51 మందికి ఆదివారం బీ-ఫామ్లు అందించడం..మేనిఫెస్టోను ప్రకటన.. హుస్నాబాద్లో సీఎం కేసీఆర్ సభ.. ఇలా ప్రచారానికి పునాది వేసుకుంది గులాబీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ బాస్ది నిన్నటి హుస్నాబాద్లో నిర్వహించింది తొలి సభ, ప్రసంగం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నాయి. కానీ ఏమైందో ఏమోగాని.. గులాబీ బాస్ ప్రసంగంలో పస లేకపోవడంతో పార్టీ శ్రేణుల అంచనాలు తలకిందులైనట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్పై కౌంటర్లు, పంచ్లతో కేసీఆర్ తనదైన స్టైల్లో విరుచుకుపడుతారనుకున్నారు. కానీ.. ఎందుకో ఆయన ప్రసంగంలో పసలేదని స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేసీఆర్ మీడియా ముందుకు వచ్చినా.. బహిరంగ సభల్లో ప్రసంగించినా ఎలా ఉంటుందో ప్రజలకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆయన వేసే పంచ్లు, ప్రాసలు, అంతకుమించి కౌంటర్లు.. మధ్య మధ్యలో జోక్లు మామూలుగా ఉండవు. అందుకే కేసీఆర్ స్పీచ్ వస్తోందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి.. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. హుస్నాబాద్ వేదికగా ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన కేసీఆర్.. ఆయన తొలి ప్రసంగంలో పస లేదు. వేదికపై ఉన్న గులాబీ నేతలు.. సభకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలు, వీరాభిమానులు కనీసం హడావుడి చేయలేని పరిస్థితి. అధినేత ప్రసంగంలో ఆ ఊపు లేదని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిన్నటి సభలో కేసీఆర్..కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతోందని.. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పుకొచ్చారు. అంతే.. ఇక బీజేపీ గురించి అయితే మాట కూడా మాట్లాడలేదు. ఈ మధ్యనే తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. కేసీఆర్ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబంపై ఏ రేంజ్లో విమర్శలు, ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ కాషాయ నేతలకు ఈ సభావేదికగా ఏకిపారేస్తారనుకున్నారు. కౌంటర్ సంగతి దేవుడెరుగు.. కనీసం బీజేపీ అనే ప్రస్తావన కూడా కేసీఆర్ నోట రాలేదు.
కేసీఆర్ ప్రసంగంతో.. పార్టీ శ్రేణులు, ప్రజలంతా సారుకు ఏమైంది..ఎందుకిలా ఉన్నారు.. బాస్లో ఎందుకింత మార్పు వచ్చింది.. అనే చర్చ మొదలైంది. ఇక ప్రత్యర్థి పార్టీలు అయితే..అయిపోయింది..అయిపోయింది..సారూ..కారు పనైపోయిందంటున్నారు. కేసీఆర్కు పట్టుకున్న ఓటమి భయం మొదటి సభ, ప్రసంగంతోనే తేలిపోయిందని చెప్పుకొస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, వీరాభిమానుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో నడుస్తోంది.
అయితే.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు కేసీఆర్. ఇప్పుడిప్పుడే కాస్త కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడుతోందని.. అందుకే ప్రసంగం ఇలా సాగిందని చెబుతున్నారు. ఇక కొందరైతే..ఇప్పుడే కదా ఆట మొదలైంది. మున్ముందు చూస్తారు కదా బాస్ ఆడే ఆట..అంటూచెప్పుకొస్తున్నారు. అయిపోయింది..అయిపోయింది..పనైపోయింది కాదు.. సింహం ఒక అడుగు వెనకేసిందంటే..నాలుగు అడుగు ముందుకేసి పంజా విసురుతుందంటున్నారు గులాబీ శ్రేణులు. అయితే..కేసీఆర్లో నిజంగా భయం మొదలైందా.. లేకుంటే ఆరోగ్యం సహకరించట్లేదా.. అనేది మరో సభతోనే తేలిపోనుంది.