Poveglia Island : ప్రపంచంలోని అనేక భయానక ప్రదేశాల్లో ఇటలీలోని పోవెగ్లియా దీవి ఒకటి. వెనిస్ నుంచి లిడో నగరాల మధ్య సముద్రంలో ఉంటుంది.
ఘోస్ట్ ఐలాండ్గా పిలిచే ఈ ప్రదేశానికి వెళ్లినవారిలో ఒక్కడూ తిరిగిరాలేదని ఇటలీ వాసులు చెబుతున్నారు.
17 ఎకరాల విస్తీర్ణంలో, చుట్టూ ఎత్తైన గోడలతో దుర్బేధ్యంగా కనిపించే ఈ దీవిలో 14 వ శతాబ్దం వరకు సుమారు వెయ్యికి పైగా జనాభా ఉండేది. ఉపాధికోసం స్థానికులు వలస పోవటం మొదలయ్యాక.. జనాభా తగ్గుతూ పోయింది.
17వ శతాబ్దం నాటికి ఈ ద్వీపం దాదాపు నిర్మానుష్యంగా మారింది. సరిగ్గా ఆ సమయంలో ప్లేగు వ్యాధి ప్రబలటంతో ప్రభుత్వం ఈ ద్వీపాన్ని పునరావాస కేంద్రంగా మార్చింది.
అయితే.. లక్షల మందికి ఈ వ్యాధి వ్యాపించటంతో చికిత్స చేయలేమని భావించిన ప్రభుత్వం.. 1.6 లక్షలమందిని ఆ ద్వీపంలో వదిలేయగా, వారంతా కన్నుమూశారు. వారందరినీ ప్రభుత్వం అక్కడే ఖననం చేసింది.
దీంతో ఇక్కడికొస్తే చావు తప్పదనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత కొన్నాళ్లకే ‘బ్లాక్ ఫీవర్’ అనే కొత్త జ్వరంతో లక్షలమంది జబ్బుపడగా, ప్రభుత్వం వారినీ ఇక్కడికే తరలించింది. వారూ అక్కడే రాలిపోగా అక్కడే ఖననం చేశారు.
ఈ తర్వాత కొన్నాళ్లకు 1800 నుంచి వందేళ్ల పాటు ప్రభుత్వం ఈ ద్వీపంలో మానసిక రోగుల చికిత్సా కేంద్రాన్ని నడిపింది. అయితే.. రోగులతో బాటు డాక్టర్లూ పిచ్చివారిగా మారిపోయి.. ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం మొదలైంది.
అంతేకాదు.. తమకు మానసిక సమస్యలున్నాయేమోననే అనుమానంతో ఇక్కడికొచ్చిన వందలాది మంది ఆరోగ్యవంతులు కూడా పిచ్చివారై పోయి ఇక్కడే చనిపోయారు.
దీంతో 1990లో ప్రభుత్వం ఈ ద్వీపంలోకి పౌరులను అనుమతించటం నిషేధించింది. నాటినుంచి అనేక మంది పరిశోధకులు, ఔత్సాహిక టూరిస్టులు ఈ ద్వీపానికి వెళ్లినా.. వారెవరూ తిరిగిరాలేదు.
దీనిని శాపగ్రస్త ద్వీపంగా భావించిన సమీప ప్రాంతాల వారు, స్థానిక మత్స్యకారులు సైతం ఆ వైపు చూడటమే మానుకున్నారు. నేటికీ దానికి కాస్త దూరంలో ఉండగానే వింత శబ్దాలు వినిపిస్తాయని వారు చెబుతున్నారు.
ఒకప్పడు జనావాసాలతో కళకళలాడిన ఈ ద్వీపం.. నేడు తమ దేశంలో ఉందన్న సంగతే ఇటలీ ప్రభుత్వం ఏనాడో మరిచిపోయిందని అక్కడి టూరిస్ట్ గైడ్స్ వివరించారు.