Rajasthan Assembly elections 2023 : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. మొత్తం 199 స్థానాలకు 82 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 31 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 100 సీట్లు. 82 స్థానాల్లో గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
అయితే.. రాజస్థానం జనం దృష్టి విద్యాధర్ నగర్ స్థానం నుంచి బరిలో దిగనున్న దియా కుమారి మీదే నిలిచింది. ఇటీవలి కాలంలో దియా కుమారికి బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే.. వసుంధరా రాజేను బీజేపీ వదిలించుకోబోతోందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా వెల్లడైన ఫలితాలతో అదే నిజమైంది.
2013లో జైపూర్లో బీజేపీలో చేరిన దియా కుమారిని వసుంధరా రాజేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించారు.
2013 నుంచి 2018 వరకు సవాయి మాధోపూర్ ఎమ్మెల్యేగా ఉన్న దియాను 2019 లోక్సభ ఎన్నికలలో పార్టీ.. రాజ్సమంద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపగా.. ఆమె విజయం సాధించింది. 2023 ఎన్నికల్లో నర్పత్ సింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విద్యాధర్ నగర్ నుంచి బరిలోకి దింపగా.. కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్ పై 71,368 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
అసెంబ్లీ టిక్కెట్ల పంపిణీలో వసుంధర రాజేను అధిష్ఠానం పక్కనపెట్టింది. ఆమె ఒంటెత్తు పోకడలతో విసిగిపోయిన బీజేపీ ఆమె స్థానంలో దియాను బరిలోకి దింపి విజయం సాధించింది. ఇప్పుడు రాజస్థాన్ సీఎం రేసులో దియా కుమారి పేరు వినిపిస్తోంది. చాలా వరకూ ఈమెనే సీఎం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎవరీ దియా కుమారి
జైపూర్ మాజీ మహారాజా సవాయి భవానీ సింగ్, రాణి పద్మినీ దేవిల ఏకైక సంతానమే.. దియా. ఇంటర్ వరకు ఢిల్లీలో చదవి, పై చదువుల కోసం లండన్ వెళ్లింది.
తిరిగి వచ్చాక.. తమ సంస్థానపు అకౌంట్స్ తనిఖీ చేసే క్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ నరేంద్ర సింగ్తో పరిచయం ఏర్పడింది.
దీనికి కుటుంబం అభ్యంతరం తెలపటంతో ఆరేళ్ల పాటు ఆమె వేచి చూసి.. ‘ఈ పెద్దాళ్లింతే’ అనుకుని 1994లో వారిద్దరూ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు.
అయితే.. ఈ సంగతి ఇరుకుటుంబాల వారికీ రెండేళ్ల వరకు తెలియకుండా రహస్యంగా ఉంచారు.
తీరా పెళ్లి సంగతి చెప్పగానే.. ప్రపంచమంతా ఆశ్చర్యపోగా.. ‘మీ ఇద్దరిదీ ఒకే గోత్రం’ అంటూ రాజపుత్ర మహాసభ మండిపడింది.
దీంతో.. ఈ మహాసభకు అధ్యక్షుడిగా ఉన్న భవానీ సింగ్ తప్పుకోవాల్సి వచ్చింది.
మరోవైపు.. వీరి కాపురం హాయిగా సాగుతుండగానే.. ఈ గోత్ర వివాదం 19 ఏళ్ల పాటు జరిగింది.
ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావటంతో 2019లో వారు విడాకులు తీసుకున్నారు.
తన ప్రేమకథను తన బ్లాగ్ ‘రాయల్టీ ఆఫ్ రాజ్పుతానా’లో దియా స్వయంగా రాసింది.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు పద్మనాభ్ సింగ్, లక్ష్యరాజ్ సింగ్, ఒక కుమార్తె గౌరవి ఉన్నారు.
ఎంపీ దియా కుమారి తన కుటుంబ వారసత్వ సంపద సిటీ ప్యాలెస్, జైఘర్ కోట, ఇతర భవనాలు, వారసత్వాన్ని పరిరక్షిస్తూ రాజకీయంలోనూ రాణిస్తున్నారు.