12 KG Gold Coin : హైదరాబాద్ చివరి నిజాం.. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న పాలకుడిగా చరిత్రకెక్కారు. 1937 ఫిబ్రవరిలో టైమ్ మ్యాగజైన్ ఇదే మాట చెబుతూ ఆయన ఫోటోను కవర్ పేజీపై ప్రచురించింది.
తన వద్ద ఉన్న టన్నుల కొద్దీ నగలను ఆయన తొలుత హైదరాబాద్ కోఠీలోని తన ప్రాసాదంలో, తర్వాతి రోజుల్లో బొంబాయి మర్కంటైల్ బ్యాంకు లాకరులో భద్రపరిచారు.
184.75 క్యారెట్ల బరువున్న జాకబ్ డైమండ్ను పేపర్ వెయిట్గా వాడిన నిజాం.. 1965 నాటి పాక్ యుద్ధ సమయంలో భారత ప్రభుత్వానికి 33వేల బంగారు నాణాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
1963లో కేంద్రం బంగారం మీద నియంత్రణ విధించినప్పుడు.. తమ వద్ద 22 టన్నుల బంగారం ఉందని నిజాం కుటుంబం అధికారికంగా ప్రకటించింది.
ఈ నగల సంరక్షణకు ట్రస్టులను ఏర్పాటుచేసిన నిజాం… తన మరణానంతరం వీటిని కుటుంబ సంక్షేమానికి వాడుకోవాలని ట్రస్టీలకు సూచిస్తూ.. వీలునామా కూడా రాశాడు.
ఆయన 1967 ఫిబ్రవరిలో తన 80వ ఏట హైదరాబాద్ కోఠీలో కన్నుమూశారు. తర్వాత ఆ నగల కోసం కుటుంబంలో కొట్లాట మొదలై 1995 నాటికి వాటిని అమ్మాలని కుటుంబ సభ్యులంతా కలిసి నిర్ణయించారు.
అయితే.. వాటిని వారసత్వ సంపదగా భావించిన కేంద్రం 1995లో జాకబ్ డైమండ్తో సహా వాటన్నింటినీ రూ.218 కోట్లకు కొని, ఢిల్లీలో భద్రపరిచింది.
కానీ.. తండ్రి దగ్గరున్న 12 కేజీల బంగారు నాణెం ఏమైందనే గుసగుసలు నిజాం కుటుంబంలో వినిపించినా.. తర్వాత వారంతా విదేశాల్లో స్థిరపడటంతో వాటినెవరూ పట్టించుకోలేదు.
అయితే.. గతేడాది జులైలో హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లో జరిగిన ప్రాచీన నాణేల ప్రదర్శనలో ఈ మాయమైన నాణెం నమూనాను ప్రదర్శించటంతో ఇది మరోమారు వార్తల్లోకి వచ్చింది.
హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సీటీలోని దక్కన్ స్టడీస్ విభాగంలో పనిచేసే ప్రొఫెసర్ సల్మా ఫారూఖీ దీనిపై కొంత సమాచారం సేకరించారు. దాని ప్రకారం…
1605 – 1627 కాలంలో మొఘల్ పాలకుడిగా ఉన్న జహంగీర్ ప్రముఖులకు బహుమతిగా ఇచ్చేందుకు 2 భారీ బంగారు నాణేలను చేయించాడు. సాహిత్య ప్రియుడైన చక్రవర్తి పార్శీలో వాటిపై తన పరిచయాన్నీ రాయించాడు.
ఒక్కొక్కటి వెయ్యి మొహర్లు విలువైన ఈ నాణేల్లో ఒకదానిని తన తండ్రి అక్బర్ మరణవార్త తెలిసి సంతాపం తెలిపేందుకు వచ్చిన నాటి ఇరాన్ చక్రవర్తి దూత అయిన యాద్గార్ అలీకి అందజేశాడు.
ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘తుజుకే – జహాంగీరి’లోనూ ప్రస్తావించారు. మిగిలిన ఆ రెండవ నాణెం తర్వాతి రోజుల్లో జహంగీర్ మనుమడైన ఔరంగజేబుకు దక్కింది.
దీనిని ఆయన యుద్ధంలో తన సైన్యాన్ని కాపాడిన ఘజియుద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగ్కు బహుమతిగా ఇచ్చాడు. ఆయన నుంచి ఆయన కుమారుడైన మొదటి నిజాంకు, ఆపై వారి వారసత్వ సంపదగా చివరి నిజాం చేతుల్లోకి వెళ్లింది.
అయితే.. 1987 నవంబర్ 9న ఈ నాణేన్ని చివరి నిజాం కుమారుడైన ముకరంజా.. జెనీవాలోని ఓ హోటల్లో వేలానికి పెట్టారు. నాడు దాని విలువ రూ.125 కోట్లు ఉండగా, దాన్ని ఆయన రూ.70 కోట్లకే వేలానికి పెట్టారు.
కానీ.. దీన్ని ఎవరైనా కొన్నారా లేదా అనేది నేటికీ తేలలేదు. ఆ రెండవ నాణెమూ ముకరంజా చేతికే చేరిందనే మరో కథనమూ ఉన్నా.. అందులోని వాస్తవాలు బయటికి రాలేదు.
ఈ వేలం సంగతి తెలుసుకున్న భారత ప్రభుత్వం సీబీఐ విచారణ అంటూ హడావుడి చేసినా.. అందులో ఏమీ తేలలేదు. కాగా.. నిరుడు కేంద్రం దీనిపై విచారణకు పూనుకుంది.