Evacuation: ఉత్తర గాజా నుంచి పాలస్తీనియన్లను ఖాళీ చేయించే ప్రక్రియ అంత సజావుగా సాగేలా లేదు. ప్రాణాలు అరచేత పట్టుకుని దక్షిణ దిశగా పయనిస్తున్న వారికి హమాస్ మిలిటెంట్ల నుంచి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. పౌరులెవరూ గాజాను వదిలి వెళ్లకుండా చేసేందుకు మిలిటెంట్లు సామదానభేద దండోపాయాలకు దిగుతున్నారు.
గాజాను వీడి వెళ్లొద్దంటూ హమాస్ జారీ చేసిన హుకుం పనిచేయలేదు. మిలిటెంట్ల బెదిరింపులన గాజన్లు ఏ మాత్రం లెక్కపెట్టడం లేదు. నీరు, వైద్యం వంటి సదుపాయాలు అందక అల్లాడిపోవడం కంటే పలాయనం చిత్తగించడం మేలనే దృఢనిశ్చయంతో దక్షిణ దిశగా కదిలిపోతున్నారు. ట్రక్కులు, కార్లు, ట్రాక్టర్లు, గాడిద బండ్లు.. ఏది అందుబాటులో ఉంటే దానిని పట్టుకుని బతుకుజీవుడా అంటూ పరారవుతున్నారు. అయినా వారిని అడ్డుకునే ప్రయత్నాలను హమాస్ ఆపడంలేదు.
ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) సూచించిన ఎవాక్యుయేషన్ రూట్లలో పలు ఆటంకాలు కల్పిస్తున్నారు. అనేక చోట్ల రహదారులను దిగ్బంధిస్తున్నారని, వాహనాలను రోడ్డుకు అడ్డంగా ఉంచి ఆటంకాలు కల్పిస్తున్నారని ఐడీఎఫ్ తెలిపింది. దీంతో పౌరుల తరలింపునకు కేటాయించిన మార్గాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోతోంది. మిలిటెంట్లు కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోదామని భావిస్తున్న ప్రజల పరిస్థితి.. ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంలా మారింది.
గాజాను వీడవద్దంటూ మిలిటెంట్లు హితవు పలుకుతున్నది ప్రేమతో కాదని.. వారిని మానవ కవచాలుగా వినియోగించుకోవాలన్న కుయుక్తి అందులో దాగి ఉందనే వాదన వినిపిస్తోంది. అందుకే పాలస్తీనియన్ల వలస ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదు. శనివారం సాయంత్రానికి 4-6 లక్షల మంది ఉత్తర గాజాను వీడినట్టు తెలుస్తోంది. ఆహారం, తాగు నీరు, విద్యుత్తు లేక గాజావాసులు అష్టకష్టాలు పడుతున్న సమయంలో ఇజ్రాయెల్ వలస ఆదేశాలు ఇవ్వడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. అలాగే పౌరులు, బందీలను హమాస్ మానవ కవచాలుగా ఉపయోగించడం తగదని హితవు పలికింది.
తరలిపోతున్న పాలస్తీనియన్లను భయభ్రాంతులకు గురిచేసే లక్ష్యంతో శనివారం ఓ ప్రచారం సాగింది. వలసలకు ఉద్దేశించిన ప్రత్యేక కారిడార్లలో ఇజ్రాయెల్ రాకెట్ దాడికి దిగిందంటూ పాలస్తీనా మీడియా ఓ వీడియోను షేర్ చేసింది. వాస్తవానికి ఆ ఫుటేజ్ను విశ్లేషించిన ఇంటెలిజెన్స్ వర్గాలు..
పార్కింగ్ చేసిన ఓ వ్యాన్లో సంభవించిన పేలుడుగా పేర్కొన్నాయి. అయితే ఆ పేలుడుకు కారణాలు ఏమిటన్నదీ తెలియాల్సి ఉంది.