Navratri 2023 : నేటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇంద్రకీలాద్రిపై నేటి తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవిగా, 17న అన్నపూర్ణాదేవిగా,18న శ్రీ మహాలక్ష్మి దేవిగా 19న శ్రీ మహాచండీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఇక 20న మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవిగా, 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 22న దుర్గాదేవిగా, 23 విజయదశమి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్ధనీ దేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది.
కాగా..దసరా ఉత్సవాలకు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వినాయకుని గుడి నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 5 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఘాట్లలో పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దసరా పండుగ సెలవుల నేపథ్యంలో బస్సులు, రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువైంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అక్టోబర్ 19,26 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు (07653) బయలుదేరుతుంది. ఇది ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంది. తిరిగి 20,27 తేదీల్లో కాకినాడ నుంచి సాయంత్రం 5.10 గంటలకు ప్రత్యేకరైలు (07654) బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకోనుంది. ఈ స్పెషల్ ట్రైన్స్ మల్కాజ్ గిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.