Pakistan Team : వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మరోసారి ఇండియా చేతిలో ఓటమి పాలైంది. అహ్మదాబాద్ లో మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లోమొదట్లో ఆత్మవిశ్వాసంతో కనిపించిన పాకిస్తాన్ తర్వాత ఒక్కసారి ఒత్తిడికి గురైంది. ఒకదశలో 155 పరుగులకి 3 వికెట్లతో పటిష్టస్థితిలో ఉన్న పాక్ తర్వాత పేక మేడలా కుప్పకూలిపోయింది. కేవలం 36 పరుగులకు చివరి 6 వికెట్లు కోల్పోయింది. 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా బ్యాటింగ్ ప్రారంభించి 30 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యం చేధించింది.
వరల్డ్ కప్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరిగాయి. ప్రతిసారి పాకిస్తాన్ ఓడిపోవడం-ఇండియా గెలవడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు అరవీర భయంకరులైన ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, మియాందాద్, అబ్దుల్ ఖాదిర్, అమీర్ సోహైల్, రమీజ్ రాజా, ఇంజమామ్ ఉల్ హక్, సలీం మాలిక్ ఇలాంటి ఎందరో ఉన్నప్పుడు కూడా ఇండియా చేతిలో పాక్ ఓడిపోయింది. 1992లో పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలిచి కూడా ఇండియా చేతిలో ఓటమి పాలవడం అదొక విశేషమనే చెప్పాలి.
పాకిస్తాన్ లో కొందరేమంటారంటే…అలా ఓడిపోవడం పాకిస్తాన్ కి సెంటిమెంట్ గా కలిసి వస్తుందని, తర్వాత మ్యాచ్ ల్లో రెట్టించిన ఉత్సాహంతో ఆడుతుందని అంటుంటారు. అదే తమ జట్టుకి కలిసి వచ్చిందని కూడా చెబుతుంటారు.
అదే భారత్ లో అభిమానులు ఏమనుకుంటారంటే… వరల్డ్ కప్ పోయినా పర్వాలేదు, పాకిస్తాన్ పై గెలిచాం అదే చాలని వీరు తృప్తి పడతారు.
ఇక భారత ఆటగాళ్లు ఏమనుకుంటారంటే… వరల్డ్ కప్ సంగతి దేవుడెరుగు…ముందు పాకిస్తాన్ ని కొడితే సగం గెలిచినట్టేననే మానసిక స్థితికి చేరిపోయారు. అందుకే వరల్డ్ కప్ లో మాత్రం చావో రేవో అన్నట్టు ఆడతారు. ఇలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు సంతృప్తి పడుతుంటారు.