Subramanya Swamy: సుబ్రహ్మణ్య స్వామి కొలువైన ఆరు ప్రధాన క్షేత్రాల్లో తిరుచెందూరు ఒకటి. తారకాసురుడిని సంహరించేందుకు బయలుదేరిన స్వామివారు.. ఈ క్షేత్రంలో బసచేసి.. పరమేశ్వరుని ధ్యానించిన పావన క్షేత్రంగా దీనికి గుర్తింపు ఉంది. స్వామి ఇక్కడ బాలుని రూపంలో దర్శనమిస్తారు.
1646 – 1648 మధ్య ఈ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సేనలకు, పోర్చుగీసు సేనలకు యుద్ధం జరగ్గా, ఆ సమయంలో డచ్ సేనలన్నీ ఈ గుడిలో దూరి ప్రాణాలు కాపాడుకున్నారు.
యుద్ధం తర్వాత ఆలయాన్ని దోచిన డచ్ సేనలు, గర్భాలయంలోని మూలమూర్తినీ పెకలించుకుని స్వదేశానికి సముద్రమార్గంలో బయలుదేరారు. అయితే.. కాసేపటికే తుఫాను వాతావరణం ఏర్పడి నౌక మునిగే పరిస్థితి తలెత్తటంతో భయపడి.. ఆ విగ్రహాన్ని నీటిలో వదిలేస్తారు. ఆ వెంటనే వాతావరణం మెరుగుపడటంతో ఆశ్చర్యపడి వారు అలాగే స్వదేశానికి సాగిపోయారు.
కొన్ని రోజులకు వాడమలయప్పన్ పిళ్లై అనే భక్తుడికి స్వామి కలలో కనిపించి తాను.. సముద్రంలో ఉన్నాననీ, రేపు సముద్రంపై ఆకాశంలో గరుడ పక్షి సంచరించే చోట, నీటిపై ఒక నిమ్మకాయ తేలుతుందని అక్కడ సరిగ్గా అడుగున తన విగ్రహం ఉందని కలలో చెబుతాడు.
అలాగే అక్కడ విగ్రహం దొరకటంతో దానిని తెచ్చి మరల ఆలయంలో వేదోక్తంగా ప్రతిష్ట చేశారు.
అనంతరం.. తిరువాయిదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించి, తనకు 9 అంతస్తుల రాజగోపురం కట్టమని ఆదేశిస్తాడు. అయితే.. ఆ నిరుపేద దేశికామూర్తి ఆలయం నిర్మాణం కోసం తొలిరోజు వచ్చిన కూలీలకు పని పూర్తయ్యాక.. కాస్త విభూతిని ఇవ్వగా.. అది వారు ఇంటికి చేరేసరికి బంగారంగా మారింది. ఈ మాట విన్న జనం.. మరునాటి నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చి గోపురనిర్మాణం చేశారట.
తమిళనాడు లో తిరునల్వేలి నుండి 60 కిలోమీటర్ల దూరములో ఉంది. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలన్నీ.. మైదాన ప్రాంతంలోని కొండలు, గుట్టల మీద ఉంటే.. ఈ ఒక్క క్షేత్రం మాత్రం సముద్రతీరాన ఉన్న గుట్టమీద ఉంటుంది.
స్కాందపురాణంలో ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన ఉంది. గతంలో పద్మాసురుడు అనే రాక్షసుడు మామిడి చెట్టు రూపములో రాగా, సుబ్రహ్మణ్యుడు వాడిని రెండు ముక్కలుగా ఖండించి సంహరిస్తాడు. అనంతరం ఆ రాక్షసుడి ప్రార్థన మేరకు ఆ రెండు ముక్కల్లో ఒకదానిని కోడిపుంజుగా, మరొకదానిని నెమలిగా మార్చి వాహనాలుగా స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి.
జగద్గురు ఆది శంకరాచార్యులు.. ఇక్కడి స్వామి దర్శనానికి వచ్చి.. కోవెల బయట ధ్యానంలో కూర్చోగానే స్వామి ఆయనకు సాక్షాత్కరించారనీ, అప్పుడే ఆయన ఆసువుగా.. సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్తం చేశారని చెబుతారు.
2004లో వచ్చిన సునామీ ధాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నామరూపాలు లేకుండా పోగా, అక్కడి ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదనీ, పైగా సముద్రం ఆ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరానికే పరిమితమైందని భక్తులు చెబుతారు.