Ponnala Lakshmaiah : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని పొన్నాల ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఆయనతో 15 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఈ సమయంలో కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. పొన్నాలను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటామన్నారు.
ఇక ఆదివారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను కలుస్తానని చెప్పారు పొన్నాల లక్ష్మయ్య. కేసీఆర్ను కలిసిన తర్వాత అన్ని విషయాలు మీడియాకు చెబుతానన్నారు. ఇక జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్యను బరిలో దింపుతారా అన్న ప్రశ్నకు కేటీఆర్.. స్పందించారు. కేసీఆర్ ను కలిసిన తర్వాత వారే అన్ని విషయాలు చెబుతారన్నారు.
శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఓ లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన గులాబీ పార్టీలో చేరేందుకే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారనే విమర్శలు వచ్చాయి.