Israel-Hamas War: ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(ఐడీఎఫ్) గాజాస్ట్రిప్లో కాలు మోపాయి. హమాస్ మిలిటెంట్ల చేతుల్లో బందీలుగా చిక్కిన వారిని గుర్తించేందుకు భూతలపోరును ఆరంభించాయి. ఆచూకీ కనిపించకుండాపోయిన 120 మందిలో కొందరి మృతదేహాలను ఐడీఎఫ్ స్వాధీనం చేసుకుంది. బందీల్లో కొందరి ఆనవాళ్లను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ సీనియర్ మిలటరీ కమాండర్ మురాద్ అబు మురాద్ మృతి చెందాడని ఐడీఎఫ్ ప్రకటించింది. గాజాలో హమాస్ ఏరియల్ ఆపరేషన్లను మురాద్ పర్యవేక్షిస్తుంటాడు. మురాద్ మృతిని హమాస్ తక్షణమే ధ్రువీకరించలేదు. గత వారం పశ్చిమ నెగెవ్లోకి మిలిటెంట్లు చొరబడటంతో పాటు 1300 ఇజ్రాయెలీల ఊచకోతకు పాల్పడేలా మురాద్ ముందుండి నాయకత్వం వహించాడు.
గతవారం ఇజ్రాయెల్పై మెరుపుదాడిలో భాగంగా 2500 మంది మిలిటెంట్లు సరిహద్దులను అతిక్రమించి తమ దేశంలోకి చొరబడ్డారని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనిజయ్ హగారీ వెల్లడించారు. హమాస్ మిలిటెంట్ల అంతు చూసేందుకే ఉత్తరగాజాను ఖాళీ చేయమంటున్నామని వివరిస్తూ ఐడీఎఫ్ విమానాల ద్వారా కరపత్రాలు వెదజల్లింది. మళ్లీ ప్రకటన చేసేంత వరకు ఇళ్లకు తిరిగి రావొద్దని సూచించింది.
దీంతో వేలాది పాలస్తీనియన్లు కట్టుబట్టలతో పరారవుతున్నారు. ఉత్తర గాజాను వీడాలంటూ ఇజ్రాయెల్ 11 లక్షల మంది పాలస్తీనియన్లకు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు గాజాను వీడి వెళ్లొద్దంటూ హమాస్ మిలిటెంట్లు వారిని తీవ్రంగా బెదిరిస్తున్నారు. గాజా నుంచి వారు దక్షిణ, సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు రాకెట్లు పేలుస్తూనే ఉన్నారు. లెబనాన్ నుంచి చొరబడేందుకు యత్నించిన నలుగురు టెర్రరిస్టులను ఐడీఎఫ్ కాల్చి చంపింది.