Congress : తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం జిల్లాలో లెక్కలు మారుతున్నాయి. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్రావుకు టికెట్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారైనట్టు చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు.
శనివారం ఉదయం రాహుల్గాంధీతో తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం అసెంబ్లీ టికెట్ గురించి చర్చించారని తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్లో చేరిన తుమ్మలకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో కా రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత ఆయన రాహుల్తో భేటీ కావడం ఇదే తొలిసారి. పార్టీలో చేరిన రోజు రాహుల్ ను కలిసే అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానం తుమ్మలను పిలిపించినట్లు సమాచారం.
అరగంటపాటు రాహుల్ గాంధీతో తుమ్మల వివిధ అంశాలను చర్చించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంతనాలు జరిపారు. ఖమ్మం జిల్లాలో పరిస్థితులు, రాజకీయ వ్యూహంపై కూడా చర్చించారని తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారని సమాచారం.